సంచలనం:నెల్లూరు బురిడీ బాబా సుధాకర్ అరెస్ట్...రూ. 28 లక్షలు స్వాధీనం
నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు బురిడీ బాబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.నెల్లూరు నగరంలోని సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్ సుధాకర్ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ సమయంలో అతని వద్ద ఉన్న 28 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భక్తులను మోసగించిన కేసులో త్వరలోనే మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. అలాగే బాబా చేతిలో మోసపోయిన భక్తులకు న్యాయం చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి అన్నారు.
నెల్లూరు కిసాన్నగర్లో నివాసముండే సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108 రోజులు పాటు మహా యాగం పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగం చేయనున్నానంటూ దీనికి సంబంధించి మొదట్లో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని సూచించారు.

అయితే ఈ ఘట్టానికి భక్తుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో పుస్తకాల ఉచిత పంపిణీ నిలిపివేసి ఆ తర్వాత పుస్తకానికి రూ.1000 ధర నిర్ణయించారు. అంతేకాదు 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి నాలుగు వందలు కలిపి రూ.1,400 ఇస్తామని ముమ్మరంగా ప్రచారం చేశారు.
దీంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆ పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో యాగం చేయాల్సిన శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400 ను మరో వంద పెంచి రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు ఎగబడి సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
అయితే ఆ తరువాత ఈ డబ్బు వసూళ్లలో కీలక పాత్ర వహించిన బురిడీ బాబా సుధాకర్ అనుచరురాలు వాసవి అనే మహిళ 2 కోట్ల రూపాయలతో పరారైంది. దీంతో భక్తులంతా బురిడీ బాబా సుధాకర్ ను డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్ సుధాకర్ బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications