యాభై లక్షల దోపిడీలో ఇద్దరు దొంగ కానిస్టేబుళ్లు, అరెస్ట్
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్లో జరిగిన 50 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ఈ దోపిడీకి పోలీసులే వ్యూహం పన్నారు. తమ శాఖలోని దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు. వారి నుండి రూ.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీచైతన్య కనస్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆబిడ్స్లోని బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తుండగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఇద్దరు వ్యక్తులు వారిని ఆపారు. టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి తనిఖీ చేయాలన్నారు. ఆ డబ్బును టాస్క్ఫోర్స్ ఆఫీసులో తనిఖీ చేసిన తర్వాత ఇస్తామని చెప్పి బ్యాగ్తో పరారయ్యారు.
ఈ కేసును ఛేదించేందుకు సిసిఎస్లో రెండు, మూడు బృందాలు పని చేశాయి. ఈ కేసుకు సంబంధించి రెండురోజుల క్రితం నిందితుల ఊహా చిత్రాలను రూపొందించారు. అనంతరం బుధవారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అరెస్టు చేసిన అనంతరం నగర పోలీసులు వారిని విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వివరించారు.