వరుసకు చిన్నమ్మ, కోరిక తీర్చాలని చేయి పట్టుకున్నాడు: ఇంటిల్లిపాదీ కలిసి హత్య!
అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామంలో సంచలనం సృష్టించిన రాధమ్మ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. తన బావ కుమారుడు కురువ నాగరాజు కోరిక తీర్చాలని ఆమెను కోరగా... ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెబితే, అది నమ్మకపోగా చిన్న పిల్లాడిపై నిందలేస్తావా? అంటూ ఆగ్రహంతో ఇంటిల్లిపాదీ కలిసి ఆమెను దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.
నిందితుల్లో భర్త కురువ గంగప్ప, అత్త మామలు లింగమ్మ, ఈరన్న, బావ నర్సింహులు, ఆయన భార్య అయ్యమ్మ, వారి కొడుకు నాగరాజులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ శ్రీనివాసమూర్తితో కలసి వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవికృష్ణ వివరాలను వెల్లడించారు.
పత్తికొండ గ్రామానికి చెందిన రాధమ్మకు మల్కాపురం గ్రామానికి చెందిన గంగప్పతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన తర్వాత ఏడాది పాటు వీరి సంసారం బాగానే జరిగినప్పటికీ, ఆ తర్వాతే భర్తతో పాటు కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. రాధమ్మకు మూర్ఛ రోగముందని సంసారానికి సరిపోవు.. అంటూ వేధించేవారు.
ఈ విషయంలో చాలాసార్లు ఇరువురికి చెందిన పెద్దలు పంచాయితీ కూడా చేశారు. గత నెల 29వ తేదీన రాధమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా, ఆమె బావ కుమారుడు నాగరాజు కోరిక తీర్చమని అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె గట్టికా కేకలు వేసింది. ఇదే విషయాన్ని తన భర్తతో పాటు ఇంట్లో వారికీ చెప్పింది.
అనవసరంగా చిన్నపిల్లవాడిపై నింద మోపుతున్నావంటూ ఆమెను కొట్టి మానసికంగా హింసించారు. ఇదే విషయాన్ని పుట్టింటి వారికి చెప్పి పంచాయితీ పెడతానని రాధమ్మ హెచ్చరించింది. దీంతో ఆ మరుసటి రోజు బావ నర్సింహు లు, ఆయన భార్య అయ్యమ్మ, కుమారుడు నాగరాజు, అత్త లింగమ్మ, మామ ఈరన్న కలసి ఇంట్లో ఉన్న రాధమ్మపై కిరోసిన్ పోసి నిప్పటించారు.
తీవ్ర గాయాలు పాలైన రాధమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న రాధమ్మ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మూడురోజుల్లో మిస్టరీని చేధించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్కు పంపించనున్నట్లు తెలిపారు.