కాపు ఎఫెక్ట్: స్థలం ఓనర్ చినబాబుకు చిక్కు, ముద్రగడ ఏ1, మీడియా సంస్థ చీఫ్పై కేసు
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం 'కాపు గర్జన'... సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబుకు చిక్కులు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. తునిలో కాపు గర్జనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజా చినబాబు అనే వ్యక్తకి చెందిన ప్రయివేటు స్థలాన్ని ముద్రగడ ఎంచుకున్నారు.
కాపు గర్జన సభ రోజు విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసం నేపథ్యంలో పోలీసులు ప్రయివేటు స్థలం యజమాని రాజా చినబాబు పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు సహాయసహకారాలు అందించారని అతనికి నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
దీనిపై రాజా చినబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు కూడా ముద్రగడ పద్మనాభం తునికి వచ్చారని తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారని తెలుస్తోంది. తునిలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ ఉంది.
తుని హింసాకాండ: ఏ1 ముద్రగడ, ఓ మీడియా సంస్థ అధినేత పైనా కేసు
తుని హింసాకాండ పైన దాదాపు అరవైకి పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. రూరల్ పోలీస్ స్టేషన్లో 57 కేసులు, టౌన్ పోలీస్ స్టేషన్లో 7, రైల్వే కేసులు మూడు నమోదు చేశారు. మొత్తం 64 మంది పైన కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. ముద్రగడను ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదయ్యాయి.
తుని ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ అధినేత సుధాకర్ నాయుడు, గర్జన స్థల యజమాని రాజా చినబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పల్లం రాజు, వట్టి వసంత్ కుమార్, సి రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, స్థానిక నేతలు తదితరులపై కేసు నమోదు చేశారు.