అమరావతి రైతుల పాదయాత్రపై ఆంక్షలు- రాజకీయ పార్టీలు పాల్గొంటే చర్యలు : 11వ రోజు యాత్ర..!!
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన ఈ యాత్ర పదో రోజైన బుధవారం మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14కి.మీ మేర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామితో పాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొని రైతులను ఉత్సాహపరిచారు. గతరాత్రి బసచేసిన పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరులో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యాత్రను ప్రారంభించారు.
పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీలు యాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ రోజు యాత్రలో ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో..ముందుగానే జిల్లాకు చెందిన టీడీపీ నేతల పైన పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్రలో ఎటువంటి రాజకీయ పార్టీలు పాల్గొని, వారి రాజకీయ పరమైన అజెండాని దానిలో చొప్పిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన క్రింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.

జిల్లా టీడీపీ నేతల కదళికలపై పోలీసులు యంత్రాంగం నిఘా ఉంచింది. పాదయాత్ర ప్రారంభమయ్యే నాగులుప్పలపాడుకు వచ్చే అన్నీ రహదారుల వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, అమరావతి రైతుల యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. మరోవైపు ప్రజల నుంచి విరాళాలు భారీగా అందుతున్నాయి. బుధవారం ఒక్క రోజే అద్దంకి నియోజకవర్గ ప్రజలు దాదాపు రూ.46 లక్షల మేర ఎమ్మెల్యే రవికుమార్ చేతులమీదుగా జేఏసీ నేతలకు అందించారు. ఈ నెల 6న ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర బుధవారం ఉదయం వరకూ పర్చూరు నియోజకవర్గంలో సాగింది.
ప్రజల సంఘీభావం తమ ఉద్యమానికి స్ఫూర్తినిస్తోందని జేఏసీ నేత శివారెడ్డి చెప్పారు. ఇప్పటికైనా తమ ఉద్యమం రాజధాని ప్రాంత 29 గ్రామాలకు సంబంధించినది కాకుండా రాష్ట్రం మొత్తం ప్రజల ఆకాంక్ష అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కోరారు. ఇదే ఉద్యమస్ఫూర్తితో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకూ యాత్రను కొనసాగించి అమరావతి రాజధానిని పరిరక్షించుకుంటామన్నారు. గురువారం నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు యాత్ర సాగనుంది.
ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఈ యాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. వారంతా 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి యాత్ర వద్దకు చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రజర్లలో రైతులతో కలిసి యాత్రలో వారంతా కొనసాగుతారు.












Click it and Unblock the Notifications