ఏపీ హోం మంత్రి గుడ్ డెసిషన్: లాక్డౌన్ డ్యూటీల నుంచి అలాంటి పోలీసులకు మినహాయింపు.. !
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. లాక్డౌన్ డ్యూటీ ఎంత క్లిష్టమైనదో తెలిసిన విషయమే. కుటుంబాలను వదిలి, మండుటెండలో పోలీసులు చెమటోడ్చుతున్నారు. ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటికి రాకుండా పర్యవేక్షిస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధుల్లో పాల్గొంటున్నారు.
పోలీసుశాఖలో పదవీ విరమణకు దగ్గరగా ఉన్న కానిస్టేబుళ్లు, గుండెనొప్పి, చక్కెర వ్యాధిగ్రస్తులు ఇలాంటి క్లిష్టతరమైన డ్యూటీలను నిర్వహించాల్సి వస్తే.. వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇకపై అలాంటి పోలీసు కానిస్టేబుళ్లకు లాక్డౌన్ విధులను కేటాయించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారిని లాక్డౌన్ డ్యూటీలు కాకుండా.. కంట్రోల్ రూమ్ లేదా కార్యాలయాలకు మాత్రమే పరిమితం అయ్యేలా విధులను కేటాయించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

55 సంవత్సరాలు లేదా అంతకు మించి వయస్సు ఉన్న పోలీసు కానిస్టేబుళ్లను లాక్డౌన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ పంపించిన ప్రతిపాదనలపై హోం మంత్రి మేకతోటి సుచరిత ఆమోదముద్ర వేశారు. 55 సంవత్సరాలకు మించిన వయస్సున్న వారితోపాటు గుండెనొప్పి, శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు, మధుమేహ వ్యాధిగ్రస్తులను కూడా లాక్డౌన్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలను తక్షణమే అమల్లోకి తీసుకుని వస్తున్నామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బందికి లాక్డౌన్ డ్యూటీల నుంచి మినహాయిస్తున్నామని, వెల్లడించారు. అలాంటి పోలీసులకు ఫీల్డ్ డ్యూటీ కాకుండా.. ఆఫీసు, పోలీసు స్టేషన్లకే పరిమితం చేస్తామని అన్నారు. కంట్రోల్ రూమ్ డ్యూటీలను అప్పటిస్తామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కానిస్టేబుళ్ల నుంచి వచ్చిన విజ్ఙప్తులను పరిగణనలోకి తీసుకున్నామని, దీనిపై హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను పంపంచామని అన్నారు.












Click it and Unblock the Notifications