ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఫలితం 2019 - పక్కా ట్రాప్, జరిగేదిదేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. పొత్తుల లెక్కలు తుది దశకు చేరుకున్నాయి. హోం మంత్రి అమిత్ సభతో ఏపీలో ఎన్నికల్లో ఎవరు ఎవరితో క్లారిటీ వచ్చేసింది. బీజేపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. బీజేపీతో పొత్తు కోరుకుంటున్న టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
టార్గెట్ సీఎం జగన్ రాజకీయం కొనసాగుతోంది. 2014 ఎన్నికలు ఏపీలో రిపీట్ ఖాయంగా కనిపిస్తోంది. కానీ, 2014 నాటి ఫలితాలు మాత్రం రిపీట్ అయ్యే అవకాశాలు లేవనే చర్చలు మొదలయ్యాయి. దీని పైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

2014 పొత్తులు రిపీట్:ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయని ఏపీ మంత్రులే చెబుతున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. ఆ ఎన్నికల్లో వైసీపీని ఓడించాయి. టీడీపీ బీజేపీకి 106 సీట్లు రాగా వైసీపీకి 67 సీట్లు దక్కాయి. జనసేన పోటీ చేయలేదు. ఈ సారి అవే పొత్తులు రిపీట్ అయితే జనసేన పోటీ చేయనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య 175 సీట్లలో షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
బీజీపీ, జనసేనకు 40-45 సీట్లు కేటాయించినా టీడీపీ 125-130 సీట్ల వరకు పోటీ చేసే ఛాన్స్ ఉంది. వైసీపీ పొత్తులు లేకుండా 2014,2019 ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే ఈ సారి సింగిల్ గానే పోటీకి దిగుతోంది. ఇక్కడ సీట్ల పంపకాలు.. గెలుపు అవకాశాలు..పార్టీల కేడర్ క్షేత్ర స్థాయిలో పరస్పర సహకారం గెలుపు ఓటముల మీద ప్రభావం చూపనున్నాయి.
బీజేపీ గేమ్ ప్లాన్: 2014లో పొత్తులు..గెలుపు తరువాత కేంద్రం - రాష్ట్రంలో బీజేపీ..టీడీపీ అధికారంలో ఒకరి ప్రభుత్వంలో మరొకరు భాగస్వాములు అయ్యారు. 2018లో నాటి ప్రతిపక్ష నేతగా జగన్ ప్రత్యేక హోదా విషయంలో నాటి సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేసారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ నాడు ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో జగన్ కు కలిసొచ్చింది. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు.
నాడు పొత్తు పెట్టుకోవాల్సిన సమయంలో బీజేపీకి దూరమైన టీడీపీ..ఇప్పుడు అవసరమా అని ఆలోచించాల్సిన సమయంలో బీజేపీకి దగ్గరవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు. ఏపీలో బీజేపీ ఓటింగ్ శాతం నామమాత్రం. కానీ, తెర వెనుక వ్యూహాలు..పోల్ నిర్వహణలో భాగంగా బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారనే వాదన ఉంది.

టీడీపీకి నష్టమా..లాభమనా: ఇప్పటి వరకు బీజేపీ అధినాయకత్వంతో సీఎం జగన్ సఖ్యతతో ఉన్నా పొత్తులు లేవని తేల్చి చెప్పారు. ఇప్పుడు జగన్ ను టీడీపీ, పవన్ కలిసినా ఓడించలేక.. బీజేపీ తో పాటుగా తిరిగి మూడు పార్టీలు కలుస్తున్నాయనే చర్చ మొదలైంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయని కారణంగా నాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు అవి అమలు కోసం ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ గట్టిగా డిమాండ్ చేయలేదు.
ఇప్పుడు ఆ హామీలు అమలు కాకుండానే తిరిగి బీజేపీతో చేతులు కలిపితే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాడు చంద్రబాబు వద్దని జగన్ కు దగ్గరైన బీజేపీ..ఇప్పుడు తిరిగి చంద్రబాబుతో స్నేహం దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ అవసరం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపైన వ్యతిరేకత కనిపిస్తోంది.
వైసీపీకి అనుకూలంగా మారేనా: స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా.. పోలవరం వంటి విషయాల్లో కేంద్రం పైన ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీతో టీడీపీ కలిస్తే ఒక విధంగా జగన్ కు మేలు చేసినట్లేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ తన అవసరాల కోసం వేస్తున్న ట్రాప్ లో టీడీపీ చిక్కుకుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీలోని పలువురు నేతలు సైతం అంతర్గత చర్చల్లో జనసేన మినహా..బీజేపీతో పొత్తు పైన ఆసక్తిగా లేరని తెలుస్తోంది. దీంతో 2014 పొత్తులు రిపీట్ అయినా..ఫలితం మాత్రం 2019 లో లాగానే తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications