రేపు అమిత్ షా, చంద్రబాబు మధ్య భేటీ: ఏం సంకేతాలిస్తారు?
రేపు చంద్రబాబు, అమిత్ షా మధ్య జరిగే భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. బిజెపి, టిడిపి మద్య చిచ్చు రగిలిన నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి తెగదెంపులు చేసుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా, నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు రేపు గురువారం మధ్యాహ్న భోజనం సమయంలో భేటీ కానున్నారు.
ఇప్పటికైతే టిడిపితో తమకు పొత్తు ఉందని అమిత్ షా అనడంపై చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా, లేదా అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు. దానికితోడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడంపై ఇరు పార్టీల మధ్య చిచ్చు రగులుతోంది.
జగన్తో ప్రధాని భేటీపై తెలుగుదేశం, బిజెపి నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తనతో జగన్ భేటీపై టిడిపి చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని మోడీ సీరియస్గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎపిలో అలా...
కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బిజెపి, తెలుగుదేశం అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఇరు పార్టీలు సంబంధాలు తెంచుకుని వేరు పడే పరిస్థితి ఏమీ లేదు. చంద్రబాబు మాత్రం బిజెపితో స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ, బిజెపి మరో రకంగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు చెబుతున్నారు.
అమిత్ షా వ్యూహం...
అమిత్ షా వ్యూహమే ఇప్పుడు చంద్రబాబును కలవరపెడుతున్నట్లు చెబుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయడానికి తెలంగాణ ముఖద్వారమని ఆయన చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు ఆయన వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎపిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
జగన్ భేటీతో చిచ్చు....
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏకపక్షంగా చంద్రబాబు పక్షం తీసుకోవడానికి సిద్ధంగా లేరని అర్థమైపోతోంది. జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చి, 40 నిమిషాల పాటు చర్చలు జరపడంతోనే ఆ విషయం స్పష్టమైంది. అయితే, జగన్తో భేటీ అయి మోడీ ఏదో తప్పు చేసినట్లుగా బాబు రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వర రావు వంటి టీడిపి నాయకులు మాట్లాడడం బిజెపి నాయకుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై చంద్రబాబు రేపటి సమావేశంలో అమిత్ షాకు వివరణ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
కొత్తగా వచ్చిన నాయకులు...
గత ఎన్నికల సమయంలో బిజెపిలోకి వచ్చిన పాత కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు అర్థమవుతోంది. కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నాయకులు ఆ దిశగా బిజెపి సాగాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా తెలుగుదేశం పార్టీపై ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి మాటకు అమిత్ షా విలువ ఇస్తారా, లేదా అనేది ఇప్పుడిప్పుడే తేలే అవకాశం లేదు. తెలుగుదేశంతో సంబంధాలపై 2019 వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ ఈ లోపు పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అమిత్ షా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఒకే విమానంలో....
అమిత్ షా, చంద్రబాబు నాయుడు రేపు గురువారం ఉదయం ఒకే విమానంలో విజయవాడకు రానున్నారు. చంద్రబాబు నాయుడు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడులో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటనతో బుధవారంతో ముగుస్తుంది. దీంతో ఇరువురు కూడా రేపు ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరి వస్తారు. చంద్రబాబు విజయవాడలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో కలిసి ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. అమిత్ షా బిజెపి బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు.