తెగించిన షర్మిల- ఏకంగా పెద్ద తలకాయపైనే గురి
ఓట్ల చోరీపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల సమర్థించారు. ఓట్ చోరీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ట్వీట్ పెట్టారు. తీగలాగుతుంటే ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ డొంక కదులుతోందని, ఓట్ల దొంగల బాగోతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతుందని అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి పథకం ప్రకారమే దేశంలో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ పేల్చింది నిజమైన హైడ్రోజన్ బాంబ్ గా అభివర్ణించారు షర్మిల. వాస్తవాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ దేశం ముందుంచారని కితాబిచ్చారు. ఓట్ల దొంగను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎలా కాపాడుతున్నారో కళ్ళకు కట్టినట్లు వివరించారు పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికారం కోసం బీజేపీ, ప్రధాని మోదీ చేసింది నిజంగా చీకటి రాజకీయమేనని మండిపడ్డారు.

రాజ్యాంగబద్ధ, స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్.. ఓట్ చోరీ ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని షర్మిల ధ్వజమెత్తారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసిందని, ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు, వద్దనుకున్న చోట్ల ఓట్లు తొలగించి బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా తన జవాబుదారీతనాన్నిచాటుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ విజయం సాధించే అలంద్ నియోజక వర్గంలో 6,000 ఓట్లను నకిలీ లాగిన్లతో తొలగించడం సహించరాని చర్యగా అభివర్ణించారు. సాఫ్ట్ వేర్ ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ను ఉపయోగించి ఓట్లను తొలగించడం అంటే దేశ ద్రోహంతో సమానమని షర్మిల అన్నారు. నకిలీ ధృవీపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో అక్రమంగా ఓట్లను తొలగించడం ఉగ్రవాద చర్యకు నిదర్శనమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలని షర్మిల చెప్పారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలని, వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని పేర్కొన్నారు షర్మిల. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కేంద్ర ఎన్నికల కమిషన్ స్వయంగా కాపాడుతున్నట్టు పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications