ఫ్లోలో అన్నాను: కిరణ్ కాప్టర్ పేల్చివేతపై తగ్గిన పొన్నం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ వెనక్కి తగ్గారు! కిరణ్ కరీంనగర్ జిల్లాలో అడుగు పెడితే తుపాకీతో ఆయన హెలికాప్టర్ను పేల్చేస్తామని పొన్నం అన్నారు. దీనిపై శుక్రవారం పొన్నం వివరణ ఇచ్చారు.
తాను ఏదో ఫ్లోలో అలా చెప్పాను కానీ, తన ఉద్దేశ్యం మాత్రం అది కాదన్నారు. తానేమీ ఉగ్రవాదిని లేదా క్రిమినల్ను కాదని చెప్పారు. వెయ్యి ఆత్మబలిదానాలు జరిగినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడటమేమిటన్నారు. సన్నిహితంగా ఉన్న శ్రీధర్ బాబుకే కిరణ్ మిత్రద్రోహం చేశారని ఆరోపించారు. మంత్రి పదవికి రాజీనామా చేయవద్దని తాము శ్రీధర్ బాబుకు సూచించామని పొన్నం చెప్పారు.

కాగా, కిరణ్ కరీంనగర్ జిల్లాకు వస్తే ఆయన హెలికాప్టర్ను తాము తుపాకీతో గాల్లోనే పేల్చేస్తామని గురువారం అన్న విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించడం ద్వారా కిరణ్ తన వక్రబుద్ధిని నిరూపించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర నేతలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు.
జూలై 30వ తేదిన తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన చేసిందని, అప్పటి నుండి కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఉన్న కిరణ్ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి ఏమాత్రం వీల్లేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఆయన కరీంనగర్ జిల్లాకు వస్తే తుపాకీతో ఆయన హెలికాప్టర్ను గాల్లే పేల్చేస్తామన్నారు. కిరణ్ హెలికాప్టర్ తెలంగాణలో ల్యాండ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత పోలీసుల పైనే ఉందన్నారు. తాము వద్దని చెబుతున్నా కిరణ్ రావడం సరికాదన్నారు. రావొద్దని చెప్పిన తర్వాత బుద్ధి ఉన్న వారెవరు కూడా రారన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు వ్యూహాత్మకంగా వెళ్లాలన్నారు. అవసరమైతే కిరణ్ క్యాంపాఫీసును ఆక్రమించుకోవాలని సూచించారు.
పొన్నం వ్యాఖ్యల పైన ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్లు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో పొన్నం పైన పలువురు కాంగ్రెసు నాయకులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications