తెరాసకు అవినీతి చిక్కు: పొన్నం ఫిర్యాదు, అవసరమైతే మంత్రికి నోటీసు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సోమవారం నాడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను పొన్నం కోరారు.
దీనిపై అవసరమైతే మంత్రికి కూడా నోటీసులు ఇస్తామని లోకాయుక్త చెప్పింది. ఇందుకు సంబంధించి ఏడుగురు ప్రభుత్వ కార్యదర్శులకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది. కాగా, లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ కుంభకోణంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా పాత్ర ఉందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కుంభకోణంలో పల్లా: ఎర్రబెల్లి
ఫీజు రీయింబర్స్మెంట్ కుంభకోణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ నల్గొండలో ఆరోపించారు. కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగల్చాలన్నారు.
తలసాని రాజీనామా మాటేమిటి: మల్లు భట్టి విక్రమార్క
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పైన ప్రభుత్వాన్ని మల్లుభట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో నిలదీశారు. తలసాని రాజీనామాపై స్పీకర్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసిన వారే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ను తెరాస సర్కారు తుంగలో తొక్కిందన్నారు. బడ్జెట్ రూపకల్పనలో మంత్రిని ఎవరో తప్పుదోవ పట్టించునట్లుగా ఉందన్నారు.
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వలేదన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 796 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పేదలపై సర్కారుకు ప్రేమ ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని కోరారు. బడ్జెట్లో మూతబడిన పరిశ్రమల ప్రస్థావనే లేదని, సచివాలయం మార్చాలనుకోవటం సర్కారు అహంకారానికి నిదర్శనమన్నారు. మెట్రోలైన్ మార్పుతో మూడువేల కోట్ల భారం పడిందన్నారు. తలసాని రాజీనామాపై సర్కారు ప్రకటన చేయాలన్నారు.
జానాతో టీడీపీ నేతల భేటీ
తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావులు భేటీ అయ్యారు. తెలంగాణ శాసన సభ సమావేశాలు మొత్తం తమను సభ నుండి సస్పెండ్ చేయడంపై జానాతో చర్చించారు. కాగా, టీడీపీ సభ్యులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.