తెలుసుకో: జగన్కు రాజ్యాంగ గ్రంథం పంపిన పొన్నం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ రాజ్యాంగం పుస్తకాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు పంపించారు. ఈ పుస్తకం చదివి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని ఆయన జగన్కు సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన ఎలా చేయవచ్చునో తెలుసుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇది వరకే ఈ గ్రంథాన్ని పంపించామని, ఇప్పుడు వైయస్ జగన్కు పంపుతున్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
వైయస్ జగన్, చంద్రబాబులపైనే కాకుండా తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తానని, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జగన్ అప్పట్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్రాన్ని విభజించాలని సోనియా చూస్తున్నారని జగన్, చంద్రబాబు విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాహుల్ గాంధీ కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు ప్రధాని కాగలరని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు, జగన్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం పెట్టినప్పుడు చంద్రబాబు, జగన్ సిపిఎం మాదిరిగా మేం తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పాల్సి ఉండిందని, అప్పుడు తెలంగాణకు అనుకూలంగా చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో తిరిగేటప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని ఆయన అన్నారు.
పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసినప్పుడు పార్టీలో చర్చించారా అని ఆయన జగన్ను ప్రశ్నించారు. అందుకే కొండా సురేఖ పార్టీకి రాజీనామా చేశారు కదా అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన అడిగారు. ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని పంపినప్పుడు జగన్ తల్లి విజయమ్మ నేతృత్వం వహిస్తారు గానీ పార్లమెంటు సభ్యుడికి నేతృత్వం వహించే అవకాశం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు, జగన్ దీక్షలు చేస్తున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సచివాలయంలో దీక్ష చేస్తే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. ముగ్గురు కూడా ఒకేసారి దీక్ష చేస్తే అయిపోతుందని ఆయన అన్నారు. వ్యూహాత్మకంగా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్రలో చాంపియన్ కావడానికి ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. ముగ్గురు కూడా తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెప్పినవారేనని, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications