నమ్మితే సర్వనాశనం తప్పదు- అమరావతి రైతులను హెచ్చరించిన పోసాని
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. మరోసారి తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్పై నిప్పులు చెరిగారు. ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలంటూ పవన్ కల్యాణ్ ఎందుకు తపన పడుతున్నాడో అర్థం కావట్లేదని అన్నారు.
ఈ ఉదయం ఆయన హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని కొందరు సీనియర్ కాపు నాయకులు ఆశిస్తూ ఉంటే ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేయాలనే బలమైన కోరికలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కాపు అభ్యర్థులను ఓడించిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం సరికాదని అన్నారు.

తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులను కుట్రలు, కుతంత్రాలతో ఓడించిన చంద్రబాబు వైపు పవన్ కల్యాణ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారని ప్రశ్నించారు. ప్రజారాజ్యం తన ఉనికిని కోల్పోవడానికి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా సంస్థలే ప్రధాన కారణమని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన బాగా లేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని పోసాని కృష్ణ మురళి చెప్పారు. అమరావతి ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లను కట్టించి ఇవ్వడానికి ప్రయత్నించిన జగన్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ న్యాయస్థానం ద్వారా అడ్డుకుందని విమర్శించారు.
అమరావతిలో పేదలకు ఇళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోన్న ఆ ప్రాంత రైతుల వైఖరిపైనా పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కమ్మ సామాజిక వర్గంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. చంద్రబాబు మాటలు వింటే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వంటి దొంగలను అమరావతికి తీసుకొచ్చి చంద్రబాబు డ్రామాలు ఆడారని ఆరోపించారు.

వైఎస్ జగన్ రాజకీయంగా బలపడితే తన కొడుకు నారా లోకేష్కు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భయపడుతున్నాడని, అందుకే రైతులను అడ్డు పెట్టుకొని న్యాయస్థానాల్లో కేసులు వేయించారని అన్నారు. గతంలో నిర్మాత అశ్వినీదత్కు చంద్రబాబు.. ప్రభుత్వ భూమి ధారాదత్తం చేశారని, ఈ విషయాన్ని అమరావతి రైతులు తెలుసుకోవాలని సూచించారు.
ఆర్ 5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం ద్వారా పేదల ఉసురు తగిలి కుళ్లికుళ్లి ఛస్తారని పోసాని వ్యాఖ్యానించారు. రైతులను జగన్పైకి ఎగదోసి, బూతులు తిట్టిస్తోన్నాడని పోసాని ఆరోపించారు. రాజకీయ నాయకుడిగా కాదు కదా కనీసం ఓ మనిషిగా కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ అన్నారు.












Click it and Unblock the Notifications