పీకల్దాకా తెచ్చిన టీడీపీ ఉర్లగడ్డ పంచాయితీ..!!
Chandrababu: తెలుగుదేశం మొదలు పెట్టిన ఉర్లగడ్డ పంచాయితీ.. ఆ పార్టీకి పీకల్దాకా తెచ్చింది. రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఈ ప్రాంతానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ రాయలసీమలో వెల్లువెత్తుతోంది.
మిఛౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొటాటోను ఉల్లిగడ్డగా సంబోధించడం.. దీనికి ప్రధాన కారణం. తిరుపతి జిల్లాలోని వాకాడు మండలంలో తుఫాన్ బాధితులతో సమావేశమైనప్పుడు పొటాటో అంటే ఉర్లగడ్డే కదా.. అని ఆయన అడిగి తెలుసుకున్నారు.

దీన్ని అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ.. వైఎస్ జగన్పై ఘాటు విమర్శలకు దిగింది. టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగం జగన్ను పెద్దఎత్తున ట్రోల్ చేసింది. చంద్రబాబు సైతం బహిరంగ సభలో జగన్ను తప్పుపట్టారు. జగన్కు ఉర్లగడ్డకు బంగాళాదుంపకు తేడా తెలియట్లేదంటూ విమర్శించారు.
ఈ వ్యవహారం.. రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఆయనపై సీమవాసులు భగ్గుమంటోన్నారు. రాయలసీమలో పుట్టి. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటోన్న చంద్రబాబుకు ఏ ప్రాంతంలో ఏ యాసతో మాట్లాడతారనేది కూడా తెలియట్లేదంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా- రాయలసీమ భాషా పరిరక్షణ సమితి ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ యాస, భాష ఎంతో విభన్నం, విలక్షణం అని గుర్తు చేసింది. సీమ భాష అంటే తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతి అని పేర్కొంది. పుస్తకాలు, నాటకాలు, పాటలు, చలనచిత్రాల్లో ఈ భాషకు ప్రత్యేక స్థానం ఉందని, కోట్లాది మంది అభిమానాన్ని కూడగట్టుకున్న రాయలసీమ భాషను చంద్రబాబు అవమానపర్చడాన్ని సరికాదని పేర్కొంది.
రాయలసీమలో బంగాళాదుంపను ఉర్లగడ్డగానే సంబోధిస్తారని, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ చిన్న విషయం తెలియకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా రాయలసీమ భాషను కించపర్చడం.. సీమ ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని పేర్కొంది.
తన ప్రయోజనాల కోసం సీమ ప్రజల మనోభావాలను కించపరిచిన చంద్రబాబు నాయుడికి తాము రాజకీయంగా సమాధి కడతామని రాయలసీమ భాషా పరిరక్షణ సమితి హెచ్చరించింది. సీమ ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటే, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతం దెబ్బ ఏమిటో రుచి చూపిస్తామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications