ఏపీలో విద్యుత్ కోతలు ఆరంభం -పెరిగిన డిమాండ్ : కొందామన్నా దొరకటం లేదు..!!
దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. జెన్కో థర్మల్ ప్లాంట్లు సైతం ఇదే సమస్యతో కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశాయి. ఏపీలో పరిస్థితులను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధాని కి లేఖ రాసారు. విద్యుత్ శాఖ అధికారులు తమ సమస్యలను వివరిస్తున్నారు. పరిస్థితికి ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరకటం లేదు. దీంతో..ఏపీలో విద్యుత్ కోతలు ఆరంభమయ్యాయి. అనధి కారింగా కోతలు అమలు చేస్తున్నారు. అనూహ్యంంగా విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. పీక్ అవర్స్ లో అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ దొరకటం కష్టంగా మారుతోంది.

కొందామన్నా దొరకని విద్యుత్
దేశవ్యాప్తంగా విద్యుత్కు డిమాండ్ పెరగటంతో యూనిట్ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొందామన్నా దొరకటం లేదు. దీంతో..గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 2-3 గంటలు విద్యుత్ కోతలు తప్పడం లేదు. అప్పటికీ సర్దుబాటు కాకుంటే చిన్న పట్టణాలకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రిడ్ భద్రత కోసం కోతలు విధించక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. లోడ్ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి ఈ సమయంలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు రేడియల్ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు.

అనూహ్యంగా పెరిగిన డిమాండ్
రాష్ట్రంలో సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి 8000- 8500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. గత నెల 18న ఇది 10,066 మెగావాట్లకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రభావం వ్యవసాయం పైన పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వరితో పాటు మెట్ట పంటల సాగుకు రోజుకు కనీసం 20 ఎంయూల విద్యుత్ అవసరం. కనీసం ఫిబ్రవరి వరకు ఈ స్థాయిలో ఇవ్వకపోతే నీరందక పంటలు దెబ్బతింటాయి. విజయవాడలోని వీటీపీఎస్లోని ఏడు యూనిట్ల నుంచి 1,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 1,100 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

అనధికార కోతలు ఆరంభం
నిర్వహణలో భాగంగా 210 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటు నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోని జెన్కో థర్మల్ ప్లాంట్లకు రోజుకు సుమారు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గత నెలాఖరు వరకు రోజుకు 24 వేల టన్నులే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రోజుకు 40 వేల టన్నుల వరకు అందుతోంది. కృష్ణపట్నంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. 500 మెగావాట్లు మాత్రమే వస్తోంది. బొగ్గు కొరత కారణంగా 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ నుంచి కొన్ని నెలలుగా ఉత్పత్తి నిలిపేశారు.

ప్రధానికి సీఎం జగన్ లేఖ
బొగ్గు కొరత లేకుంటే మరో 25 ఎంయూల విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు వేసవిని దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వలు పెంచాలి. రోజుకు కనీసం 20 రేక్లు (ఒక్కో రేక్కు 3,500 టన్నులు) వస్తే ప్రస్తుత అవసరాలు పోను వేసవి కోసం కొంత బొగ్గు నిల్వ చేసుకోగలమని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. కడపలోకి ఆర్టీపీపీకి 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే.. 536 మెగావాట్లు మాత్రమే వస్తోంది. బొగ్గు కొరతతో కొన్ని నెలలుగా మూడు యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశారు.
Recommended Video

నిండుకుంటున్న బొగ్గు నిల్వలు
వీటీపీఎస్లో ఒకరోజుకు విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. ఆర్టీపీపీˆలో ఉన్న నిల్వలు 3 రోజులకు, కృష్ణపట్నంలో ఉన్నవి 5 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఇక, ప్రస్తుతం అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలు పరిస్థితి మెరుగు పడకుంటే నగరాల్లోనూ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేంద్రం మంత్రి కోతలు విధించే పరిస్థితి ఉండదని చెబుతోంది. కానీ, ఏపీ ప్రభుత్వం రోజుకు 20 రేక్ ల బొగ్గు కోరుతున్నా..కేంద్రం నుంచి ఆ స్థాయిలో సరఫరా రావటం లేదు. దీంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ నిర్వహణ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.












Click it and Unblock the Notifications