ఏపీలో విద్యుత్ కోతలు: రెండు వారాలపాటు పరిశ్రమలకు పవర్ హాలిడేస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఏపీ ట్రాన్స్-కో తెలిపింది. ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలని పేర్కొంది.
పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే విధిస్తున్నట్లు, వారాంతపు సెలవుకు ఇది అదనంగా ఉంటుందని ట్రాన్స్ కో వెల్లడించింది. ఈ మేరకు మూడు డిస్కంల పరిధిలో పవర్ హాలిడే ప్రకటనలు విడుదలయ్యాయి.
విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారంటూ చంద్రబాబు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ ఓ వీడియోను జత చేశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్న చంద్రబాబు.. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. నాడు మిగులు విద్యుత్తో వెలుగులు నిండిన ఏపీలో నేడు చీకట్లు నిండడానికి కారుకులెవరని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు కరెంట్ ఎందుకు పోతుందో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్ లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారు?(1/3) pic.twitter.com/yQW24jmnaz
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2022
భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా.. ఈ కోతలు ఎందుకని ప్రశ్నించారు. ఓ వైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని.. నీరో కాక ఇంకేమనాలని ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని, సమస్యను పరిష్కరించాలన్నారు.