ఎన్టీఆర్ చివరి రోజులు దయనీయం : అప్పుడేమయ్యారంటూ ఫ్యామిలీ, బాబుపై ప్రసన్నకుమార్
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటుండగా.. టీడీపీ నేతలు మాత్రం మహా నాయకుడికి అవమానం అంటూ మండిపడుతున్నారు. తాజాగా, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు.
పెద్దాయనకు అన్నం పెట్టారా?: ఎన్టీఆర్ ఫ్యామిలీపై ప్రసన్నకుమార్
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలపై ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈరోజు ఎన్టీఆర్ కుమారులకు ఆయన మీద ఎందుకంత ప్రేమ వచ్చిందని ప్రశ్నించారు. చివరి రోజుల్లో ఆ పెద్దాయనకు కనీసం అన్నం పెట్టారా? అని నిలదీశారు. ఇప్పటికీ ఎన్టీఆర్ తమ గుండెల్లోనే ఉన్నారని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే ఎమ్మెల్యే, మంత్రినయ్యా: ప్రసన్నకుమార్
నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)ను తాము ఎప్పటికీ మర్చిపోమని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని, మంత్రి అయ్యానని చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంతో మా తండ్రికి అన్యాయం జరిగిందని ఆయన కుమారులు అనడం సరికాదని ప్రసన్న కుమార్ రెడ్డి హితవు పలికారు.
బాలకృష్ణ, పురంధేశ్వరి అప్పుడేమయ్యారంటూ ప్రసన్న కుమార్
ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు లాక్కొన్నప్పుడు బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించినప్పుడు పురంధేశ్వరికి ఎన్టీఆర్ కనిపించలేదా? అని నిలదీశారు. వైస్రాయ్ హోటల్ వద్ద దేవుడు లాంటి ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించడం వల్లే చంద్రబాబుకు ఈ గతి పట్టిందని విమర్శించారు.
టీడీపీలో ఉన్నది నకలీ నేతలేనంటూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్
యూనివర్సిటీ పేరు తీసేసినందుకు గగ్గోలు పెడుతున్నారెందుకు? అని ప్రశ్నించారు. ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకులని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన ఎన్టీఆర్ అభిమానులు ఇళ్లల్లోనే ఉన్నారన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నవారంతా నకిలీ నేతలేనని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు.