ఛలో విజయవాడ హైటెన్షన్: ప్రభుత్వ ఉద్యోగులు..టీచర్ల అరెస్టులు..గృహ నిర్బంధం: తనిఖీలు
అమరావతి: ఏపీలో నెలకొన్న పీఆర్సీ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. కొత్త వేతనాలను అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఉద్యమిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఇవ్వాళ ఛలో విజయవాడ ఆందోళనను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఫలించని చర్చలు..
విజయవాడకు బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్నారు. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వం గానీ, ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు గానీ మెట్టు దిగట్లేదు. దీనితో ప్రతిష్ఠంభన యధాతథంగా కొనసాగుతోంది. ప్రభుత్వం పలుమార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ.. ఐక్య కార్యాచరణ కమిటీ, పీఆర్సీ సాధన సమితి నాయకులు స్పందించలేదు. సంప్రదింపులు నిర్వహించడానికి మంత్రులతో కూడిన కమిటీ సమక్షానికి హాజరు కాలేదు. మంగళవారం వారు మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ- అవి కొలిక్కి రాలేదు.
పేస్లిప్పుల ద్వారా తేడా..
కొత్త వేతన పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం జీవోలను జారీ చేయడం, వాటిని మంత్రివర్గం ఆమోదించడంతో ఈ వివాదం మరింత రాజుకున్నట్టయింది. కొత్త జీవోల ప్రకారమే ప్రభుత్వం వేతనాలను కూడా చెల్లించింది. కొత్త వేతన చెల్లింపులకు సంబంధించిన స్లిప్పులను ఉన్నతాధికారులు వెబ్సైట్లల్లో అందుబాటులో ఉంచారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వేతనం కూడా తగ్గలేదని పునరుద్ఘాటించారు. డిసెంబర్, జనవరి నెలల వేతనాల్లో నెలకొన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు.

ఛలో విజయవాడ విజయవంతానికి..
ఇది- ప్రభుత్వ ఉద్యోగులను మరింత రెచ్చగొట్టినట్టయిందనే అభిప్రాయం ఉంది. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు- ఆ ప్లే స్లిప్పులను తగులబెట్టడాన్ని బట్టి చూస్తే- వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఛలో విజయవాడ ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ- ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనక్కి తగ్గట్లేదు. దాన్ని విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మారువేషాల్లో విజయవాడకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మారువేషాల్లో
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలో వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులను ఏమార్చడానికి పెళ్లివారమండి అనే బ్యానర్లతో ఉద్యోగులు విజయవాడకు బయలుదేరినట్లు చెబుతున్నారు. దినసరి వేతన కార్మికులు, రైతు కూలీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఇలా వేర్వేరు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకుంటున్నారనే సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది.

విస్తృతంగా తనిఖీలు..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తం అయ్యారు. విజయవాడకు బయలుదేరి వెళ్లే అన్ని బస్సులను కూడా తనిఖీ చేశారు. అందులో ప్రయాణిస్తోన్న వారి వివరాలను సేకరించారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు. రాత్రంతా ఈ తనిఖీల పర్వం కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన వారిని పోలీసులు అక్కడికక్కడే నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిని సమీప పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.

పీఆర్సీ సాధన సమితి నేతల హౌస్ అరెస్టులు..
ఛలో విజయవాడ ఆందోళన నేపథ్యంలో- పీఆర్సీ ఉద్యమంలో ఇప్పటికే గుర్తించిన సాధన సమితి నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అన్ని జిల్లాల్లోనూ వారి ఇళ్ల వద్ద పోలీసులను మోహరింపజేశారు. హౌస్ అరెస్ట్ చేశారు. నియోజకవర్గ స్థాయి నాయకులు మారు వేషాల్లో విజయవాడకు చేరుకోవడానికి బయలుదేరగా.. పలు చోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఛలో విజయవాడ ఆందోళనకు అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇదివరకే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications