శ్రీశైలం అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం: సాయం ప్రకటించిన కేసీఆర్
న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Recommended Video
శ్రీశైలం ఘటనపై తెలుగులో ట్వీట్ చేసిన రాష్ట్రపతి..
‘తెలంగాణలోని శ్రీశైలం జల విద్యుత్తు ప్లాంటు లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ ట్వీట్ చేశారు.
కలచివేసిందంటూ ప్రధాని..
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరగిన ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీశైలం ప్రమాద ఘటనలో 9 మంది మృతి..
జల విద్యుత్ కేంద్రం ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలంగాణ విద్యుత్ శాఖ వెల్లడించింది. తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో.. డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ మృతి చెందారు.

ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం.. మిగితా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, శాఖాపరమైన ప్రయోజనాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా, అంతకుముందు ఈ ప్రమాద ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications