ఏపీ వాసుల కలలు తీర్చేందుకు.. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 29వ తేదీన విశాఖ నగరంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 29వ తేదీన విశాఖకు రానున్న ప్రధాని మోదీ అక్కడ రోడ్ షో లో పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
రైల్వే జోన్ తో పాటు వివిధ ప్రాజెక్ట్ లకు ప్రధాని శంకుస్థాపన
ఇక అక్కడ వేదికనుండే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విశాఖ వాసుల దశాబ్దపు కల రైల్వే జోన్ 2 కు కూడా ప్రధాన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని సమాచారం.

85000 కోట్లు పెట్టుబడితో నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన
ఇప్పటికే విశాఖను గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం ఈమేరకు విశాఖలో అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి చేస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం ఎట్టకేలకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుంది. మొత్తం ప్రధాని మోదీ 85000 కోట్లు పెట్టుబడితో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ తో 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రధాని పర్యటన నేపధ్యంలో విస్తృత ఏర్పాట్లు
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల 29వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తోన్న నేపద్యంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో ఏర్పాట్లపై చర్చించారు.
విశాఖలో ప్రధాని బహిరంగ సభ
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంసభ, అంతకుముందు జరిగే రోడ్ షో నిర్వహణ పై భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి తోపాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ లు హాజరవుతున్నారు.ఈసందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రధాని సభ షెడ్యూల్ చెప్పిన జిల్లా కలెక్టర్
బహిరంగ సభకు ప్రధాని సాయంత్రం 4గంటల 40నిమిషాలకు చేరుకుంటారని, సాయంత్రం 5గంటల 25 నుమిషాల నుంచి 5గంటల 43 నిమిషాల వరకు ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు.అనంతరం 5.45 గంటలకు సభ నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగు పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications