నేను విన్నాను..నేను ఉన్నాను: సర్కారువారి పాటలో వైఎస్ జగన్ డైలాగ్: అదరగొట్టిన మహేష్
అమరావతి: ఘట్టమనేని కుటుంబం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న సర్కారువారి పాట ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ ఇది. కీర్తి సురేష్ హీరోయిన్. కామెడీ నటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ బాబు నటించిన సినిమా ఇదే.

రెండున్నరేళ్ల తరువాత..
రెండున్నర సంవత్సరాల తరువాత మహేష్ బాబు సినిమా విడుదల కాబోతోంది. దీనితో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నిజానికి- షెడ్యూల్ ప్రకారం.. ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొని రావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి అప్పట్లో. సెకెండ్ షోలను రద్దు చేశాయి. నైట్ కర్ఫ్యూను కూడా విధించాయి.

రెండుసార్లు వాయిదా..
అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తోండటం కూడా ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి ఓ కారణమైంది. టికెట్ల రేట్ల వివాదం ముగియడంతో అప్పటివరకు విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న తరువాత ఏప్రిల్ మొదటివారంలో సర్కారువారి పాటను విడుదల చేయాలని చిత్రం యూనిట్ మొదట నిర్ణయించుకుంది. అయినప్పటికీ.. ఆ తేదీకి కూడా విడుదల కాలేకపోయింది.

భారీ సినిమాలకు థియేటర్ల సమస్య లేకుండా..
ఆ సమయంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్, జూనియర్ ఎన్టీఆర్- రామ్చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కావాల్సి ఉండటం వల్ల వెనక్కి తగ్గింది సర్కారువారి పాట. ఆయా సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తకుండా ఉండటానికి ఒక అడుగు వెనక్కి వేసింది. పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీస్టారర్ మూవీ మొదటగా విడుదలైంది. అనంతరం రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్.. తాజాగా ఆచార్య విడుదల అయ్యాయి.

నేను విన్నాను..నేను ఉన్నాను..
ఇక సర్కారువారి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నెల 12వ తేదీన. కాగా- ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. దుమ్ము దులిపింది. నిమిషాల వ్యవధిలో లక్షలాది లైక్స్ను సొంతం చేసుకుందీ ట్రైలర్. మహేష్ బాబు స్కీన్ ప్రజెన్స్ డిఫరెంట్గా కనిపించింది. అభిమానులకు పోకిరి సినిమాను గుర్తు చేసింది. అందులో ఉన్నట్టే మేనరిజం, హెయిర్ స్టైల్, లుక్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కాగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్ను వాడటం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టయింది.

పొలిటికల్ టచ్..
ఈ డైలాగ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ వాడుతుంటారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ డైలాగ్ను ఆయన విస్తృతంగా ప్రయోగించారు. ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది ఇది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సర్కారువారి పాటలో అదే డైలాగ్ను వాడటం- వైఎస్ఆర్సీపీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.












Click it and Unblock the Notifications