రాధాకు తప్పవా బాధలు..! వంగవీటి కి మరో ఐదేళ్లు బ్రేకేనా..?
అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు వంగవీటి రాధా కు రాజకీయాల్లో పదవులను అనుబవించేందుకు మరికొంత సమయం వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రాధా రాజకీయ జీవితం మరో ఐదేళ్ల పాటు బ్రేక్ పడింది. తప్పుల మీద తప్పులు చేసి తన రాజకీయ జీవితానికి తానే వంగవీటి రాధా సమాధి కట్టుకున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా లెగసీ తనకు ఎన్నటికీ ఉంటుందని, తనకు బలమైన సామాజిక వర్గం అండగా ఉంటుందని భావించిన వంగవీటి రాధా వరుసగా టర్న్ లు తీసుకుంటూ తానే పాలిటిక్స్ నుంచి టర్న్ అయిపోయారు.
మొదటి నుంచీ సందిగ్దమే..! రాజకీయ భవితను తేల్చుకోలేని రాధా..!!
ప్రజల నాడిని పసిగట్టంలో పూర్తిగా రాధా విఫలమయ్యారు. వంగవీటి రాధా తొలుత కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే కాగలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి టిక్కెట్ ఇస్తామని చెప్పినా, మంత్రి పదవి దక్కుతుందని హామీ ఇచ్చినా రాధా పెడచెవిన పెట్టి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. అప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీల పట్ల ఊగిసలాట..! స్థిరత్వం కోల్పోయిన వంగవీటి..!!
అక్కడే దాదాపు నాలుగేళ్ల పాటు ఉన్న వంగవీటి రాధా కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ కోసం పట్టుబట్టారు. కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు చేరడంతో ఆయనకే టిక్కెట్ దక్కుతుందని భావించిన రాధా పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. వంగవీటి రాధాను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకూ జగన్ పార్టీ ప్రయత్నించింది. విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేతలువచ్చి కూడా రాధాను బుజ్జగించారు.
సరైన నిర్నయం తీసుకోలేక పోయిన రాధా..! అగమ్య గోచరంలో భవిత..!!
మచిలీపట్నం పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని సూచించారు. అప్పుడు రాధా ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. పైగా తన తండ్రి ద్వేషించే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ రావడంతో టీడీపీలో చేరిపోయారు వంగవీటి రాధా. మచిలీపట్నం పార్లమెంటు సీటు రాధా వద్దనడంతో వల్లభనేని బాలశౌరికి టిక్కెట్ దక్కింది. ఆయన ఇప్పుడు ఎంపీగా గెలిచారు. వంగవీటి రాధా వైసీపీ అభ్యర్థిగాపోటీ చేసినా ఇప్పుడు ఎంపీ అయి ఉండేవారు. ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన రాధాకు టిక్కెట్ ఇవ్వలేదు.
ఎమ్మెల్సీ అవకాశాలు కూడా తక్కువే..! మరో ఐదేళ్లు బ్రేకే..!!
అనకాపల్లి నుంచి పోటీ చేయమని చెప్పడంతో అందుకు రాధా అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీ తరుపున కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాను ఎమ్మెల్సీ అవుతానని రాధా భావించారు. ఇప్పడు వచ్చిన ఫలితాలను చూస్తే రాధాకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కడం కష్టంగానే ఉంది. ఎందుకంటే టీడీపీకి దక్కిన స్థానాలతో ఎమ్మెల్సీ పదవి కూడా రావడం కష్టమే. దీంతో వంగవీటి రాధా రాజకీయంగా తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లయింది. మరో ఐదేళ్లు రాధాకు మరోసారి రాజకీయంగా విశ్రాంతి లభించినట్లే.