తేలిపోతున్న అమరావతి- సుప్రీం కీలక ప్రశ్నలు-బాధితుల్లేని స్కాంగా ముద్ర
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ఏర్పాటు సందర్భంగా అమరావతి చోటు చేసుకున్న భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇందులో టీడీపీ నేతలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగానే తెలుసుకుని అక్కడ భారీ ఎత్తున భూములు కొనడం ద్వారా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో బాధితులెవరూ ముందుకు రాకపోవడంతో సుప్రీంకోర్టులో జరిగిన తాజా విచారణలో స్కాం ఆరోపణలు తేలిపోతున్నాయి.

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ట్విస్టులు
అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా 2014-15 మధ్య చోటు చేసుకున్న భూముల క్రయ విక్రయాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగమేనని వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచే ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ, ఏసీబీ, సిట్ ని రంగంలోకి దింపినప్పటికీ వైసీపీ సర్కార్ కు మాత్రం తగిన ఆధారాలు మాత్రం లభించలేదు.
అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే వ్యవహారాన్ని నిరూపించడం కష్టమన్న వాదనల మధ్య.. వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఇంతలోనే బాధితులు కోర్టుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారంలో ట్విస్టులు చోటు చేసుకుంటుున్నాయి.

హైకోర్టు తీర్పుతో ఇన్ సైడర్ కు చెక్
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ సర్కార్ క్రిమినల్ కేసులు నమోదు చేసినా... ఏపీ హైకోర్టు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని అమరావతికి వర్తింపచేయడమే తప్పని తేల్చిచెప్పింది. స్టాక్ మార్కెట్ కో, గుర్రపు పందాల్లోనో వాడే ఇన్ సైడర్ ట్రేడింగ్ పదాన్ని అమరావతిలో భూముల లావాదేవీలకు వాడటాన్ని తప్పుబట్టింది. దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఈ అక్రమాల్ని నిరూపించడం కష్టమని తేలిపోయింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ కు అక్కడా ఊరట దక్కడం లేదు.

అమరావతిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అమరావతిలో భూముల స్కాం, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల క్రియ విక్రయాలపై ఏడేళ్ల తర్వాత క్రిమినల్ కేసులు పెట్టడమేంటని ఏపీ సర్కార్ ను ప్రశ్నించింది. భూములు అమ్ముకున్న వారు చెబితే తప్ప ఈ వ్యవహారంలో నేరం జరిగిందో లేదో చెప్పలేమని కూడా వ్యాఖ్యానించింది.
ఇంతకే అమ్మాలని కొన్నవారు ఒత్తిడి చేయనప్పుడు మోసం జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించింది. అంతిమంగా బాధితులు ముందుకు రానప్పుడు స్కాం ఎలా నిరూపిస్తారని సుప్రీంకోర్టు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

చంద్రబాబు అండ్ టీమ్ హ్యాపీ
అమరావతి భూముల స్కాం, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి వైసీపీ సర్కార్ జరుపుతున్న దర్యాప్తులపై ఇప్పటికే మండిపడుతున్న టీడీపీ పెద్దలు తాజా పరిణామాలపై మాత్రం సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టేయడం, ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ బాధితులు ఫిర్యాదు చేయనప్పుడు క్రిమినల్ కేసుల వరకూ ఎందుకు వెళ్లారనేలా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ లో సంతోషం నింపుతున్నాయి. అమరావతిలో అక్రమాలు జరగలేదని తాము ఎప్పటినుంచో చెప్తున్నా వినకుండా తమను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడేం చెబుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications