నా దగ్గర ఇలాంటివి కుదరదు: పవన్ వార్నింగ్, శ్రీరెడ్డికి ఝలక్, ఆ టీవీ ఛానల్స్ ఎందుకు చూడాలి?
Recommended Video

అమరావతి: ఓ పార్టీకి మద్దతుగా ఉంటుందంటూ కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కూడా తన ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగించారు. అంతేకాదు, తమను ఆరు నెలలుగా బహిరంగంగా తిడుతున్న వారు ప్రయివేటుగా క్షమాపణలు చెబుతున్నారని, ఇలాంటివి తన వద్ద కుదరదన్నారు.
ఇటీవల సినీ నటి శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఇటీవల ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. అనవసరంగా టీఆర్పీల కోసం తన తల్లిని తిట్టారని మండిపడ్డారు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ఫిలిం ఛాంబర్లో నిరసనకు దిగారు. అప్పటి నుంచి వరుస ట్వీట్లు పెడుతున్నారు.

ఇలాంటివి నా దగ్గర కుదరవు
సోమవారం ఉదయం నుంచి ట్వీట్లు ప్రారంభించారు. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్లో నోటికొచ్చినట్లు తిట్టారని, ప్రయివేటుగా క్షమాపణలు చెబుతున్నారని, ఇలాంటివి తన దగ్గర కుదరవని తేల్చి చెప్పారు. గత ఆరు నెలలుగా తనను, తన తల్లిని, అభిమానులను, అనుచరులను నోటికొచ్చినట్లు తిట్టారన్నారు. ఇంతటి నీచ బుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా? అని మండిపడ్డారు.
ఆ పేపర్, న్యూస్ ఛానల్స్ ఎందుకు చూడాలి?
మనలను, మన తల్లులను, ఆడపడుచులన్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలని, వాళ్ల టీవీలు ఎందుకు చూడాలని, జర్నలిజం విలువలతో ఉన్న ఛానెల్స్, పత్రికలకు మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందన్నారు. వీరికి జనసేన 'వీరమహిళ' విభాగం అండగా ఉంటుందన్నారు.

ఆ మూడు ఛానల్స్ పైన భగ్గు
మరో ట్వీట్లో మూడు ఛానల్స్ను టార్గెట్ చేశారు. ఇలాంటి ఎమోషనల్ అత్యాచారీల నుంచి రక్షించుకునేందుకు ఎలాంటి నిర్భయ చట్టం కావాలి? అని ప్రశ్నించారు. ఆ మూడు ఛానల్స్ ఎవరు నడుపుతున్నారు అని మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా పర్యటనపై
సాయంత్రం లోపు తన నాలుగు రోజుల చిత్తూరు జిల్లా ప్రజల సమస్య, పర్యటనపై వివరాలు తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ చిత్తూరును ఎంచుకోవడం ద్వారా సీఎం చంద్రబాబు సొంత ఇలాకాలో టీడీపీని మరింత టార్గెట్ చేస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications