జోరు వానలోనూ "వీర జవాన్" మురళీ నాయక్కి జన నీరాజనం..
భారత్ - పాక్ యుద్దంలో తెలుగుబిడ్డ వీరమరణం పొందడం సర్వత్రా విషాదం నింపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ వీర మరణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తున్నారు. రోడ్డు పొడవునా జననీరాజనం పట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతికకాయం వెంట ముందుకు సాగుతున్నారు.
మంత్రి సవిత మురళీ నాయక్ పార్థివదేహం వెంటే ఉన్నారు. మరో రెండు మూడు గంటల్లో కల్లితండాకు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మురళీ నాయక్ కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరికని వాపోయారు. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని చెబుతున్నారు.

2022 డిసెంబరులో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు మురళీ నాయక్. తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేసి.. రెండున్నరేళ్ల సర్వీసు పూర్తికావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని కలలుకంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. మురళి వారి తల్లిదండ్రులకు తమకు ఏకైక కుమారుడు. గారాబంగా పెంచుకుంటున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణవార్తతో ఇక తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రభుత్వ అధికార లాంఛనాలతో మురళీ నాయక్ స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి సవిత సైతం ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. తనవంతు సాయంగా రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఆదుకుంటాయని భరోసా ఇచ్చారు. మురళీ తండ్రి శ్రీరాం నాయక్ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తండాలోని వారి సొంత పొలంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
ప్రముఖ గాయని మంగ్లీ ఇవాళ కల్లి తాండా విచ్చేసి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు ఆపరేషన్ సిందూర్ కోసం తన ప్రాణాలను అర్పించాడని కొనియాడారు. మహిళలు సిందూరం పెట్టుకునేటప్పుడు మురళీ నాయక్ వంటి జవాన్ల ప్రాణత్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications