గ్రామాల్లో పబ్లిక్ రేడియో...సాధ్యా సాధ్యాలు పరిశీలించండి:అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి:గ్రామాల్లో ప్రజల మధ్య నిరంతరం సమాచారాన్ని పరిపుష్ఠం చేసేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో పబ్లిక్ రేడియోలను ఏర్పాటు చేయడానికి అవకాశాలు పరిశీలించాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్లో ఆర్టీజీఎస్, ఈ-ప్రగతిపై సిఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రజల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేలా ప్రత్యేకంగా పబ్లిక్ రేడియో ఏర్పాటుకు వీలుందేమో పరిశీలించాలని అధికారులకు సూచించారు.
పబ్లిక్ రేడియో...ప్రయోజనాలు
గ్రామాల్లో పబ్లిక్ రేడియో వల్ల ప్రజల మధ్య సమాచార వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, తద్వారా విపత్తులు, వాతావరణ ప్రతికూలతలు ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఉంటుందసి సిఎం చంద్రబాబు వివరించారు. ఇది లాభం కోసం కాదని వ్యక్తులు, వర్గాలు, మరియు సముదాయాలను అప్రమప్తం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల ఒక బలోపేతమైన మానవ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుందన్నారు.
డేటానే...కీలకం
అలాగే ఈ- ప్రగతి పనుల్ని నిర్దేశిత లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డేటాను సమర్ధవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటా కలిగిన వారే సంపన్నులని, అదే అతి పెద్ద సంపదని ఆయన వెల్లడించారు. డేటాను సరిగ్గా వినియోగించుకుంటే అనూహ్య ఫలితాలు సాధించవచ్చని, సిఎం డ్యాష్ బోర్డులో ప్రజల మరిన్ని వివరాలు తెలిసేలా ఆధునీకరించాలని ఆయన సూచించారు.
ఆ నగరాలపై...సిఎం సంతోషం
దేశంలోని 10 అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో రాష్ట్రానికి చెందిన విజయవాడ, తిరుపతి, నగరాలు స్థానం పొందడంపై సిఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను ముందువరుసలో నిలిపేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. ఇందుకోసం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అయితే విశాఖపట్నం కూడా ఈ జాబితాలో స్థానం పొందాల్సివుందని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఛాన్స్ కోల్పోయిందన్నారు.
సాంకేతికతతో...సమర్థవంతం
సాంకేతికతతో ఆయా ప్రాంతాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని సిఎం చెప్పారు. అలాగే వీధి దీపాలు మొదలు పారిశుద్ధ్యం వరకు సమర్ధవంతంగా పర్యవేక్షించగలమని...సామాజికంగా, ఆర్థికంగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి, వాటిని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. దీనిని సాధించడానికి సంతోష సూచీలో ముందుకు వెళ్లడం కూడా ముఖ్యమని, దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు ఫైబర్నెట్ పనులు పూర్తిచేయాలన్నారు. కంటెంట్ కార్పొరేషన్ పనులు కూడా వేగవంతం చేయాలని సూచించారు.
అధికారుల...వివరణ
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రహదారులపై ఉన్న గుంతలను గుర్తించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఫైబర్నెట్ ఎండీ ఏఎస్ దినేష్కుమార్ సిఎం చంద్రబాబుకు తెలిపారు. మొత్తం 70 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లోని రహదార్లను డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఫ్రీ వైఫై పాయింట్ల ఏర్పాటు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 4 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 27 వేల 93 ఉచిత వైఫై పాయింట్లను గుర్తించనట్లు తెలిపారు. వర్చువల్ తరగతి గదుల ఏర్పాటు సెప్టెంబర్ నెలకల్లా పూర్తిచేస్తామని సిఎంతో చెప్పారు.