బెంగుళూరుకు చిరు..బాలయ్య..తారక్ - పునీత్ కు నివాళి : ఆ క్షణాలు గుర్తు చేసుకుంటూ - భారంగా...!!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోలుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోనూ అనేక మందితో పునీత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆకస్మిక మరణంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. పునీత్..అతని కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకొని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన మరణం పైన ఆవేదన చెందారు.
టాలీవుడ్ ప్రముఖుల ఆవేదన
కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పారు. అదే సమయంలో రాజ్ కుమార్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని..ఎప్పుడు బెంగుళూరు వెళ్లినా... ఆ కుటుంబాన్ని కలిసే వాడినని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా పునీత్ మరణం తాను జీర్ణించుకోలేకపోతున్నానని బాధ పడ్డారు. గతంలో పునీత్ హైదరాబాద్ వచ్చిన సమయంలో మీడియా పవర్ స్టార్ పునీత్ అనగానే....స్పందించిన పునీత్ తాను తెలుగు రాష్ట్రాలకు వచ్చిన్పపుడు పవర్ స్టార్ ను కాదన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఉన్నారని... ఆయనంటే తనకు చాలా అభిమానమని చెప్పుకొచ్చారు.
బాధలో మునిగిన సినీ ఇండస్ట్రీ
ఇక, బాలయ్య సైతం పునీత్ మరణం పట్ల షాక్ అయ్యారు. పునీత్ ఇంత చిన్న వయసులో తమందరినీ వదిలి వెళ్లిపోవటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్త వింటూనే తన హార్ట్ బ్రోకెన్ అంటూ ట్వీట్ చేసారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో....నిన్న మొన్నటి వరకు పునీత్ - జూనియర్ ఎన్టీఆర్ మధ్య అంత క్లోజ్ రిలేషన్ నడిచింది. జూనియర్ ఎన్టీఆర్ పాటలు పాడుతారనే విషయం తెలుసుకున్న పునీత్ చక్రవ్యూహ అనే యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమాలో జూనియర్ తో పాట పాడించారు.
జూనియర్ తో పాట పాడించుకొని..సూపర్ హిట్
గెలియా..గెలియా అనే పాటను ఎన్టీఆర్ పాడారు. సినిమాలో ఆ పాట అభిమానులను ఎంతగానో అలరించింది. సినిమా సూపర్ హిట్ అవడంలో ఆ పాట పాత్ర కూడా ఎంతో ఉంది. ఇక, డైలాగ్ కింగ్ మోహన్ బాబు..మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్...వెంకటేష్..రోజా వంటి వారు పునీత్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. నమ్మలేకపోతున్నామంటూ బాధ వ్యక్తం చేసారు. ఇక, ఈ సాయంత్రం పునీత్ అంత్య క్రియలు తన తండ్రి రాజ్ కుమార్ సమాధి వద్దే జరగనున్నాయి. అమెరికాలో ఉన్న పునీత్ కుమార్తె రాగానే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
పునీత్ కు నివాళి..ఆ ముగ్గురు హీరోలు బెంగుళూరుకు
ఇక, పునీత్ మరణంతో షాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి... నందమూరి బాలయ్య..జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్తున్నారు. వారు పునీత్ భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. తమ కళ్ల ముందే ఊహించని ప్యాన్ ఫాలోయింగ్ తో కన్నడ నాట హీరోగా ఎదిగిన పునీత్ ను చివరి సారిగా చూసేందుకు వారు బెంగుళూరు వెళ్లాలని నిర్ణయించారు. ఇక, పునీత్ పార్దివ దేహాన్ని చూసిన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాజ్కుమార్ కుటుంబీకులు, సమీప బంధువులు తరలివచ్చారు. ఇదే సందర్భంలో రాఘవేంద్ర రాజ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ అప్పును ప్రశాంతంగా పంపుదామనా తీవ్రమైన ఆవేదనలో తెలిపారు.