జనసేనతో పొత్తుపై బీజేపీ మూడ్ ఛేంజ్ - తేల్చేసిన పురందేశ్వరి..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. ఏపీలో జనసేన - టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఏపీలో బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సమయంలోనే తెలంగాణలో జనసేనతో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని బీజేపీ ప్రకటించింది. జనసేన ఇప్పటికీ ఎన్డీఏలోనే ఉంది. కానీ, బీజేపీ నిర్ణయం లో మార్పు కనిపిస్తోంది. తాజాగా పొత్తుపై పురందేశ్వరి స్పందించారు.
కొత్త లెక్కలు : ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో బీజేపీ తీరులో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి మద్దతు వెనుక వ్యూహం ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి రావాలని బీజేపీకి పవన్ ప్రతిపాదించారు. తెలంగాణలో ప్రధానితో కలిసి పవన్ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. కానీ, ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో తమకు పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇటు పవన్ కల్యాణ్ ఏపీలో టీడీపీతో పాత్తు..అధికారం గురించి మాత్రమే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా బీజేపీ గురించి మాట్లాడటం లేదు. దీంతో, ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.

పొత్తు కొనసాగేనా : ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమి పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 21న బీజేపీ నేతలు ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు..భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమయంలోనే జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు కొనసాగించారు.

బీజేపీ నిర్ణయం ఏంటి : తెలంగాణలో బీసీ సీఎం..ఎస్సీ వర్గీకరణ ద్వారా సీట్లు - ఓట్లు పెరిగాయని బీజేపీ విశ్లేషిస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో పార్టీ బలోపేతం దిశగానే ఎన్నికల నిర్ణయాలు ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, 2014 తరహాలోనే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. పవన్ ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావన చేయకుండా టీడీపీతో మాత్రమే సంబంధాలు బలపడాలంటూ చేస్తున్న ప్రసంగాల పైన బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. దీంతో..ఈ మొత్తం పొత్తుల వ్యవహారం పైన ఈ నెల 21న జరిగే బీజేపీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications