3 కోట్లు, అమరావతిలో 1000 గజాలు: సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగుతేజం పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
అదే విధంగా సింధు కోచ్ గోపిచంద్కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. విజయవాడలో శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నజరానాలతో పాటు అసెంబ్లీ సమావేశాల్లోపు సింధుతో పాటు కోచ్ గోపిచంద్కు అభినందన సభ ఏర్పాటు చేసిన ఘనంగా సన్మానించనుంది.
కాగా, భారత్కు కాంస్య పతకం తెచ్చిపెట్టిన సాక్షి మాలిక్కు కూడా రూ.50 లక్షల బహుమతిని ప్రకటించింది. సింధుకు 2 కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా సింధూకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్కు రూ.10 లక్షలు ప్రకటించింది.
ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది. మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో స్పెయిన్కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ మారిన్ చేతిలో ఓటమి పాలవడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తొలి సెట్ను కైవసం చేసుకున్న సింధు, ఆ తర్వాత రెండు సెట్లలో ఒత్తిడికి లోనై ఓటమి పాలైంది. కాగా, సింధుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటిని బహుమానంగా ఇవ్వనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు రూ. కోటి పారితోషకం ఇస్తామని టీ ప్రభుత్వం తన క్రీడా విధానంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే సింధుకు ఇచ్చే బహుమతిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం సింధుకు ఇంకా బహుమతిని ప్రకటించలేదని, శనివారం భేటీ కానున్న మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారని ట్వీట్ చేశారు.
For sake of clarity: Telangana Govt is yet to announce reward for Sindhu. An announcement will be made after the cabinet meet by Hon'ble CM
— KTR (@KTRTRS) 20 August 2016