తిరుమల వెంకన్నదర్శనానికి కోటా;ఏడాదికి రెండు సార్లేనా..ఆలోచన..ఎందుకంటే?...
Recommended Video

తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే విషయమై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆలోచన చేస్తోంది. తిరుమల వెంకన్నను ఏటా రెండుసార్లు మాత్రమే దర్శించుకునేలా నియంత్రణ విధించే ఆలోచన చేస్తున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించడం కలకలం రేపుతోంది.
బెంగుళూరులో ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాము ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నామో మంత్రి మాణిక్యాలరావు వివరణ ఇచ్చారు. అయితే కారణాలు ఏమైనప్పటికి...ఈ ఆలోచన భక్తుల సౌకర్యార్థమే అయినప్పటికి...వారు ఈ నిర్ణయాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు? ఎంతవరకు స్వాగతిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి.

మంత్రి మాణిక్యాలరావు...ఏమన్నారంటే?...
బెంగళూరులో ఎపి దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఓ తెలుగు మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ.."ప్రస్తుతం 70 వేల నుంచి 90 వేల మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం దక్కుతోంది. రోజూ సుమారు 30 వేల మంది భక్తులు దర్శనం చేసుకోకుండానే నిరాశతో వెనుదిరుగుతున్నారని...అన్ని రకాల దర్శనాలను ఆధార్తో అనుసంధానించి... ఏటా రెండుసార్లు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలనే ఆలోచన ఉంది. రానున్న రోజుల్లో తిరుమల కొండపైకి భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా... తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నాం'' అని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.

నిర్వహణకు...స్వయంప్రతిపత్తి కలిగిన పటిష్ఠమైన వ్యవస్థ...
అలాగే దేవాలయాల నిర్వహణకు ఎన్నికల కమిషన్ తరహాలో స్వయంప్రతిపత్తి కలిగిన పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని, దీనిపై విస్త్రృత స్థాయిలో చర్చ జరగాలని మంత్రి మాణిక్యాలరావు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరు ఐఐఎం విద్యార్థుల వద్ద తాను ఇదే అంశాన్ని ప్రస్తావించానని.. దీనికి చక్కటి పరిష్కారాలు ఆలోచించాలని కూడా వారిని కోరానని మంత్రి తెలిపారు. ప్రైవేటు సంస్థల నిర్వహణలోని ఆలయాలతో పోలిస్తే...ప్రభుత్వ అజమాయిషీలోని అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో పాలనే భేషుగ్గా ఉందని మంత్రి చెప్పారు.

లౌకికి ప్రభుత్వాలకు...హిందూ దేవాలయాలపై
పెత్తనం...సమంజసమా?
"అయితే ఇదే సమయంలో లౌకిక ప్రభుత్వాలకు హిందూ దేవాలయాలపై పెత్తనం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న కూడా తలెత్తుతోందన్నారు. ముస్లింలు, క్రైస్తవుల ప్రార్థనా మందిరాల నిర్వహణలో ఎక్కడా ప్రభుత్వ జోక్యం కనిపించదని...ఇలాంటి వెసులుబాటు హిందూ ఆలయాలకు ఎందుకు కల్పించడం లేదని చాలా మంది తనను ప్రశ్నిస్తున్నారని మంత్రి చెప్పారు. ఎన్నికల కమిషన్ తరహాలో స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధమైన అధికారాలు కలిగిన సంస్థను ఏర్పాటు చేస్తే హిందూ ఆలయాలకు చెందిన కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడవచ్చని"...మంత్రి మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు.

భక్తుల మనోభావాల...ఆలోచించారా?...
అయితే ఇంతటి కీలక నిర్ణయం గురించి ఆలోచన చేసేముందు భక్తుల మనోభావాలను గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆథ్మాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు...ఏ కారణం చేతనైనా...దైవ దర్శనానికి కోటా అంటే భక్తులు అంగీకరించకపోవచ్చని వారు అంటున్నారు. అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు భక్తుల అభిప్రాయాలను సేకరించిన తరువాతే ఆ ఆలోచన చెయ్యాలే తప్ప భక్తుల సౌలభ్యం కోసమంటూ ఏ నిర్ణయాలైనా ప్రభుత్వమే తీసుకోరాదంటున్నారు. తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి నియంత్రణ చేపట్టాలనే ఆలోచన చెయ్యడానికి కారణం ఏమిటని...భక్తుల నుంచి అలాంటి వినతులు ఏమైనా వచ్చాయా?...వస్తే ఆ విషయాన్ని ముందుగా తెలపాలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications