వెంటాడుతున్న రఘురామ: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో పిల్: దర్యాప్తు సరిగా లేదంటూ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ..ముఖ్యమంత్రి జగన్ ను వెంటాడుతూనే ఉన్నారు. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామ వేసిన పిటీషన్ పైన ఇప్పటికే విచారణ సాగుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు రఘురామ జగన్ అక్రమాస్తుల పైన హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్లో ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ తన పిల్ లో ఆరోపించారు.
కేసులకు ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని ఆయన పిల్ లో ఆరోపించారు. అన్ని అంశాలను దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని పిల్లో రఘురామ కోరారు. ఇప్పటికే రఘురామ సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్ లో తాను ఎందుకు పిటీషన్ వేసిందీ రఘురామ వివరించారు. జగన్ పైన కేసులను త్వరగా తేల్చాలనే ఉద్దేశంతోనే పిటీషన్ దాఖలు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక, కోర్టులో వాదనల సమయంలో తాను ఈ పిటీషన్ దాఖలు చేసినందుకే తనను వేధిస్తున్నారని.. కేసులు నమోదు చేస్తున్నారంటూ కోర్టులో చెప్పుకొచ్చారు.
అయితే, జగన్ తరపు న్యాయవాదులు మాత్రం..అసలు ఈ పిటీషన్ వేయటానికి రఘురామకు అర్హత లేదంటూ వాదించారు. రాజకీయంగా దురుద్దేశ పూర్వకంగా పిటీషన్ వేసారని కోర్టుకు నివేదించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలక పాల్పడుతున్నందున..ఆయన పైన అనర్హత వేటు వేయాలని పార్టీ కోరిందని..దీంతో ఆయన ఈ పిటీషన్ దాఖలు చేసారంటూ కోర్టుకు వివరించారు. అయితే, ఇందులో కీలకమైన సీబీఐ ఒక మెమో దాఖలు చేసింది. న్యాయంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది.
రఘురామ తరపు న్యాయవాదులు మాత్రం సీబీఐ తమ వాదనలు వినిపించకుండా ఉండటం సరి కాదని..వారి వాదనలు వినాలని వారు కోర్టును కోరారు. దీంతో..రఘురామ.. జగన్ తరపు న్యాయవాదులు..సీబీఐ సైతం లిఖిత పూర్వకంగా వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ముగ్గురి తరపున వాదనలు విన్న తరువాత..కోర్టు ఇక జడ్జిమెంట్ దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో...మరింతగా పట్టు బిగించేందుకే ముందస్తు ప్రణాళికల్లో భాగంగా హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో లోక్ సభలో రఘురామ పైన అనర్హత వేటు కోసం వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.