హైకోర్టులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ : కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి-నాని సైతం : రఘురామ..!!
ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు హైకోర్టు ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సైతం బెయిల్ కండీషన్లు ఉల్లంఘించారని వారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. దీనికి జగన్..సాయిరెడ్డి తరపు న్యాయవాదులు రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటీషన్లు దాఖలు చేసినట్లుగా కోర్టుకు నివేదించారు.
సీబీఐ సైతం కోర్టే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ల పైన తీర్పు వచ్చే సమయంలో రఘురామ తాను వేసిన పిటీషన్లను విచారిస్తున్న బెంచ్ నుంచి మరో బెంచ్ కు మార్చాలని కోరగా..హైకోర్టు రఘురామ వాదనను తప్పు బట్టింది. ఆ పిటీషన్ ను తోసి పుచ్చింది. దీంతో..బెయిల్ పిటీషన్ల రద్దు పైన తీర్పు ఇచ్చిన సీబీఐ కోర్టు ఆ రెండు పిటీషన్లను తిరస్కరిస్తూ నిర్ణయం వెలువరించింది. దీని పైన అప్పీల్ కు వెళ్తానని చెప్పుకొచ్చిన రఘురామ..ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు.
ఈడీ కోర్టుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా రఘురామ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఈ 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని.. ఇది చాలా సముచితమని వివరించారు.
10 శాతం కోటాలో కాపు, బలిజ, తెలగలకు 5 శాతం, మిగతా 5 శాతం రిజర్వేషన్లను కమ్మ, రెడ్డి, ఇతర అగ్ర సామాజికవర్గాలకు కల్పించాలని తిరిగి ఇప్పుడు రఘురామ సూచించారు. దీనికి అనుగుణంగా సీఎం నిర్ణయం అమలు చేసేలా ..సీఎంకు సలహా ఇవ్వాలన్నారు. తాజాగా విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజలు కరెంటు బిల్లు కట్టకపోతే జరిమానా వేయడమే కాకుండా ఫ్యూజులు పీకేస్తారని, కాంట్రాక్టులు చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఎవరి ఫ్యూజులు పీకేయాలని నిలదీశారు.
సినిమా టికెట్ల ధరల నియంత్రణ ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకేనంటున్న మంత్రి పేర్ని నాని.. దసరా సందర్భంగా ఆర్టీసీ చార్జీల బాదుడుకు ఏం సమాధానం చెబుతారంటూ రఘురామ ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభ వేదికగా కాపు..బలిజ..తెలగ...ఒంటరి కులాలు పెద్దన్న పాత్ర పోషించాలి.. బీసీ - ఎస్సీలను కలుపుకొని రాజ్యాధికారం సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఇక, పవన్ వ్యాఖ్యల పైన చర్చ జరుగుతున్న సమయంలోనే రఘురామ తాజాగా కాపులకు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల లో అయిదు శాతం కేటాయించాలని చెబుతున్నారు.
Recommended Video
రఘురామ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించటం లేదు. అయితే, ఇప్పుడు సీబీఐ కోర్టు తిరస్కరించినా.. తిరిగి జగన్ బెయిల్ రద్దు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంతో తిరిగి ఈ అంశం మరో సారి రాజకీయంగా చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.