చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..
కాదు కాదంటూనే కాషాయదళానికి మరింత దగ్గరవుతోన్నట్లు కనిపిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు పూనుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న ఆయన.. దానికి సమాధానంగా వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు సోమవారం లేఖ రాశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ప్రధాని మోదీని కీర్తిస్తూ ఓ పాటను విడుదల చేశారు. ఎంపీ అనూహ్య చర్య ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

చైనాను ప్రస్తావిస్తూ..
తాను బీజేపీలో చేరుతానని వైసీపీ ఎంపీ ఏనాడూ నేరుగా చెప్పనప్పటికీ.. ఆ మేరకు ఇప్పటికే పలు సంకేతాలివ్వడం తెలిసిందే. తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దు వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా డీల్ చేస్తున్నారనే అర్థం వచ్చే రీతిలో ఓ పాటను రఘురామ విడుదల చేశారు. ‘‘జయం మనది.. జయం మనది.. జయం మనదిరా.. నవభారత రథసారథి మోదీ సారథ్యంలో..'' అంటూ సాగే పాటను వైసీపీ ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అలా నరుక్కొస్తున్నారు..
షోకాజ్ నోటీసులపై సీఎం జగన్ కు లేఖ రాసిన కొద్ది సేపటికే ‘రాజుగారి మోదీ పాట' వెలుగులోకి రావడాన్ని బట్టి ఆయన నేరుగా ముఖ్యమంత్రికే తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్లు అర్థమవుతోందని, సరిహద్దులో చైనాతో వివాదం దేశభక్తికి సంబంధించిన అంశం కావడంతో తన పాటను ఇటు సీఎంగానీ, అటు వైసీపీ పార్టీగానీ తప్పుపట్టే అవకాశమే లేదని రఘురామ భావిస్తున్నట్లు తెలుస్తోందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ గతంలో విజయసాయి రెడ్డికి రాసిన లేఖపైగానీ, ఇప్పుడు సీఎం జగన్ కు రాసిన లేఖపైగానీ వైసీపీ నుంచి స్పందన పూర్తిగా కరువైన సందర్భంలో.. ఒత్తిడి మరింత పెరిగేలా అటు నుంచి నరుక్కొచ్చే ఎత్తుగడలో భాగంగానే ఆయన ‘మోదీ పాట'ను విడుదల చేసినట్లుగా చర్చ నడుస్తోంది.

వేటు తప్పదని తెలిసే ఇలా..
తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిస్తే.. షోకాజ్ నోటీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో.. అది కూడా ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి హోదాలో విజయసాయి రెడ్డి జారీ చేయడమేంటంటూ ఏకంగా లీగల్ అంశాలనే లేవనెత్తారు రఘురాముడు. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఆయన, ఈసీ నిర్ణయం ఎలా ఉన్నా, జగన్ పై గౌరవంతోనే షోకాజ్ నోటీసులకు బదులిస్తానన్నారు. ఆ మేరకు లేఖ రాసినా.. ఆ వెంటనే మోదీ పాటను కూడా విడుదల చేశారు. వైసీపీ నేతలెవరూ ఈ వ్యవహారంపై బయటికి కామెంట్లు చేయనప్పటికీ.. వేటు తప్పదనే రఘురామ ఇలా వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది..

జగన్కు జై.. సాయిరెడ్డిపై ఫైర్..
షోకాజ్ నోటీసులకు సమాధానంగా సోమవారం రాసిన లేఖలో ఎంపీ రఘురామ వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంభించారు. జగన్ నాయకత్వానికి జేజేలు పలుకుతూనే.. పక్కన చేరిన కోటరీ వల్లే అందరూ ఇబ్బందులు పడుతున్నారంటూ విజయసాయి రెడ్డిపై ఫైరయ్యారు. ఇటీవల సీ-ఓటర్ సర్వేలో ఏపీ సీఎం జగన్ నాలుగో ర్యాంకు పొందడంపై శుభాకాంక్షలు చెబుతూ, త్వరలోనే మొదటి స్థానం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు రఘురామ పేర్కొన్నారు. తెలుగు మీడియం విషయంలో రాజ్యాంగ వ్యతిరేకత, టీటీడీ ఆస్తుల అమ్మకంలో శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా నోరెత్తాను తప్ప పార్టీ గీత దాటలేదని, ఎంపీగా గెలుపుతో 90 శాతం క్రెడిట్ అధినేతకే దక్కుతుందని రఘురామ వివరించారు.

ఈసీ వివరణపై కీలక వ్యాఖ్యలు..
విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఎన్నికల సంఘం వివరణను కూడా జగన్ కు రాసిన లేఖలో ఎంపీ రఘురామ పొందుపర్చారు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి కాకుండా వేరే పేరుతో ఉన్న లెటర్ హెడ్ తో నోటీసులు పంపడాన్ని పరిశీలిస్తామని ఈసీ చెప్పిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోరాదని మరోసారి స్పష్టం చేసిందని రఘురామ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications