మాజీ సీఎం సమాధి..చర్యలొద్దు- రుషికొండపై రఘురామ షాకింగ్..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యే హోదాలో రఘురామ కృష్ణంరాజు చివరి ప్రసంగం చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికకు ముందు ఆయన వైజాగ్ లోని రుషికొండ భవనాలపై జరుగుతున్న చర్చలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు రుషికొండపై చర్యలు వద్దంటూ ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు. దీంతో షాక్ అవడం సభ్యుల వంతయింది.
రుషికొండపై ముఖ్యమంత్రి నివాస భవనం నిర్మించడానికి బయటకు తెలియకుండా డ్రామాలాడారని రఘురామ రాజు ఇవాళ అసెంబ్లీలో ఆరోపించారు. మొదట పర్యాటక భవనాల నిర్మాణాలు అంటూ చిత్రీకరించారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసం కోసం అధికారుల పరిశీలనలో రుషికొండను గుర్తించినట్లు సినిమా స్టోరీ అల్లారని విమర్శించారు. వందల కోట్ల రూపాయలతో నిర్మించింది నివాస భవనం కాదు మాజీ ముఖ్యమంత్రి సమాధి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం వల్లే తమ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని రఘురామ గుర్తుచేశారు. గత ముఖ్యమంత్రి చేసిన తప్పులే తమకు వరంగా మారాయన్నారు. అందుకే రుషికొండ నిర్మాణాలపై చర్యలు తీసుకోవద్దన్నారు. రుషికొండ భవనాలను స్మారకంగా మార్చి ఎంతో కొంత ఎంట్రీ టికెట్ ధర పెట్టి పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రఘురామ కోరారు.












Click it and Unblock the Notifications