Raghurama: తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తుపట్టబోతున్న రఘురామ..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజును గత వైసీపీ హయాంలో రాజద్రోహం కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. కస్టడీలో దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశించడం, ఇందులో దాడి నిజమని తేలడం జరిగిపోయాయి. ఆ తర్వాత రఘురామకు బెయిల్ కూడా లభించింది. అయితే రఘురామపై అప్పట్లో దాడి చేసిన ముసుగు దొంగలెవరో ఇంకా తేలలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో తనపై కస్టడీలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామ రాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా అప్పట్లో రఘురామపై దాడి అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ ఆధ్వర్యంలో జరిగిందని గుర్తించారు. అయితే దాడి సమయంలో రఘురామ గుండెలపైకి ఎక్కి కూర్చొన్న ముసుగు దొంగను గుర్తించాల్సి ఉంది.

అయితే తాజాగా కామేపల్లి తులసీబాబు అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపారు. దీంతో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ముందు అతను విచారణకు హాజరు కాబోతున్నాడు. అయితే అదే సమయంలో తాను కూడా వస్తానని, నిందితుడిని గుర్తుపడతానని ప్రకాశం జిల్లా ఎస్పీకి రఘురామరాజు లేఖ రాశారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామ రాకతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది.
అప్పట్లో రఘురామపై కస్టడీలో దాడి వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ కు ఈ తులసిబాబు అనే వ్యక్తి సన్నిహితుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయ్ పాల్ పై జరుగుతున్న విచారణలో ఈ విషయం గుర్తించారు. ఈ తులసి గుంటూరుతో పాటు గుడివాడ ప్రాంతాల్లో తిరుగుతుంటాడని కూడా ఆధారాలు లభించాయి. దీంతో జనవరి 3న ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో విచారణకు రావాలని అతనికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ తులసీబాబును గుర్తించేందుకు రఘురామ కూడా ప్రకాశం ఎస్పీ ఆఫీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications