మోడీ సభకు వస్తా-జగన్ భద్రత ఇచ్చేలా చూడండి-కేంద్రాన్ని కోరిన రఘురామ
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేధించి దూరమైన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో తనకు భద్రత లేదంటూ ఏకంగా ఢిల్లీకే మకాం మార్చారు. అప్పటి నుంచి తిరిగి తన నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టలేదు. గతంలో పలుమార్లు నియోజకవర్గానికి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన రఘురామ.. ఈసారి ప్రధాని మోడీ భీమవరం టూర్ ను అడ్డుపెట్టుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం భద్రత కోరుతున్నారు.
నరసాపురానికి దూరంగా రఘురామ
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో విభేధించడం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీకే పరిమితమవుతున్నరఘురామ తన సొంత నియోజకవర్గం నరసాపురానికి పూర్తిగా దూరమయ్యారు. తనకు ఓట్లు వేసిన నరసాపురం ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యంగా భావించి ఢిల్లీలోనే ఉండిపోయారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ లేదంటూ వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ.. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. కానీ మధ్యలో నియోజకవర్గానికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు.
ప్రధాని మోడీ భీమవరం టూర్
సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి వచ్చేందుకు కొంతకాలంగా శత విధాలా ప్రయత్నిస్తున్న రఘురామరాజు.. త్వరలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ భీమవరానికి వస్తున్న జూలై 4వ తేదీన ఎలాగైనా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు. ఓవైపు తనకు రక్షణ లేదంటూనే మరోవైపు భీమవరానికి వెళ్లాలని భావిస్తున్న రఘురామ ఇందుకోసం కేంద్రాన్ని ఆశ్రయించారు. గతంలో ఓసారి కేంద్రాన్ని ఆశ్రయించి వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్న రఘురామ... ఇప్పుడు మరోసారి తనకు భీమవరం టూర్ లో భద్రత కోరుతున్నారు.
జగన్ కు ఆదేశాలు ఇవ్వాలని వినతి
ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ను, హోంశాఖ కార్యదర్శిని కలిసిన రెబెల్ ఎంపీ రఘురామ జూలై 4న ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తాజాగా విశాఖ లో పార్లమెంటరీ కమిటీ సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించినా తనను అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. అందుకే ప్రధాని మోడీ భీమవరం టూర్ లో తనకు తగిన భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని రఘురామ కోరారు.అయితే దీనిపై హోంశాఖ నుంచి తక్షణం ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేదు.