స్పీకర్ ఖరారులో చంద్రబాబు మార్క్ నిర్ణయం..!!
ఏపీలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరుతోంది. మూడు పార్టీల ప్రభుత్వం పాలన ప్రారంభిస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గం కూర్పులో చంద్రబాబు అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించారు. పలువరు సీనియర్లను పక్కన పెట్టారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు..బీసీలకు ప్రయార్టీ దక్కింది. సామాజిక సమీకరణాల్లో క్షత్రియ వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. స్పీకర్ విషయంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయిస్తున్నారు.
కేబినెట్ కూర్పుతో
చంద్రబాబు తన తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేశ్.. కమ్మ వర్గానికి చెందిన లోకేశ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ ను ఎంపిక చేసారు.

కొత్త స్పీకర్ ఎవరు
రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎం.రాంప్రసాద్రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్ చోటు సంపాదించారు. క్షత్రియ వర్గానికి ఛాన్స్ దక్కలేదు. దీంతో..రఘురామ రాజుకు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యేగా గెలిచిన మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని సమాచారం. అయితే, ఇదే సమయంలో స్పీకర్ పదవి కోసం రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి పరిశీలనలో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది.

చంద్రబాబు లెక్కలు
నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉందని భావిస్తున్నారు. కాపు వర్గానికి ఇవ్వాలని భావిస్తే కన్నాకు ఆ పదవి దక్కుతుందనేది మరో అంచనా. ఎస్సీ వర్గానికి స్పీకర్ గా ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ చేస్తే...మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేరు ఖరారు చేసే ఛాన్స్ ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే..ప్రస్తుత మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే..క్షత్రియ వర్గానికి స్పీకర్ పదవి దక్కుతుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో..రఘురామ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు మంత్రివర్గం పైన స్పష్టత రావటంతో..స్పీకర్ గా చంద్రబాబు ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications