ఎన్టీఆర్ను బాబు బాగా: రఘువీరా, ప్రత్యేక హోదాపై తీర్మానం: బొత్స
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై రఘవీరారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించినవారు లేరన్నారు. 'ఏపీకి ప్రత్యేక హోదా' సదస్సులో ఆయన సోమవారం మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి, అన్ని విషయాల్లో ప్రజలను మోసం చేశారని రఘవీరా ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహించాల్సింది మహానాడు కాదని, దగానాడని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను ఎలా మోసం చేసిందీ, ఆయన అకాల మరణానికి కారణమైన తీరుపై దగానాడులో చర్చించాలని రఘువీరా ఈ సదస్సు సందర్భంగా బాబుకు సూచించారు. నందమూరి హరికృష్ణ సహా మిగతా వాళ్లను ఎలా మోసం చేశారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు 'ఒక చరిత్ర - కొన్ని నిజాలు' అనే పుస్తకం కూడా రాశారని ఆయన అన్నారు.
2004 ఎన్నికల్లో జూ. ఎన్టీఆర్ను ప్రతి ఊరు తిప్పి, బాగా వాడుకుని, ఇప్పుడు ఆమడదూరంలో పెట్టారని రఘవీరారెడ్డి అన్నారు. బాబు కుమారుడు లోకేశ్ను ప్రమోట్ చేసేందుకే జూ. ఎన్టీఆర్ని పక్కన పెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు బ్రీఫ్ కేసు, చిన్నబాబుకు సూట్ కేసు ఇస్తేనే ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని అన్నారు.
ఏపీలో ప్రస్తుతం సూట్ కేసు - బ్రీఫ్ కేసు ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. అటు రైతులను, ఇటు మహిళలను చంద్రబాబు వంచించారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామన్న ఆయన, మళ్లీ అదే పార్టీతో పొత్తు కొనసాగించటం రాజకీయ వ్యభిచారమేనని తీవ్ర స్ధాయిలో వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రులను తెలుగుదేశం వెనక్కి పిలిస్తే, కేంద్రం దిగి వస్తుంది: చెవిరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేయాలని చంద్రగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఏపీకి ప్రత్యేక హోదా'పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులను తెలుగుదేశం పార్టీ వెనక్కి పిలిచి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
మహానాడులో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలి: బొత్స
ఏపీకి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసేందుకు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టాలని ఆయన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమైందని దుయ్యబట్టారు.