ఏపీ సొమ్ము తెలంగాణకు, బాబు 500 కోట్లు: రఘువీరా, బాబు-కేసీఆర్ ఒక్కటవుతారు
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని, ఏపీకి టీడీపీ చేస్తున్న ద్రోహం వెలుగు చూసిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. తెరాసకు మద్దతివ్వడం ద్వారా వైసీపీ తమ మధ్య ఉన్న రహస్య ప్రేమను బయటపెట్టుకుందన్నారు.
రాష్ట్ర విభజనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర, జగన్ ఉద్దేశ్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఏపీ సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆ సొమ్మును తెలంగాణకు తరలిస్తోందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులోనే బాబు రూ.500 కోట్లు సంపాదించారని ఆరోపించారు.
ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్, బాబులది ఒకే స్కూలు అన్నారు. అవసరమైతే ఇద్దరూ ఒక్కటవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీ రామచంద్రయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అప్రూవర్గా మారి క్షమాపణలు చెప్పాలన్నారు. పోలవరం రాజధాని, నిర్మాణం కేంద్రం ఆధ్వర్యంలో జరగాలన్నారు.
కేసీఆర్పై మందకృష్ణ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏఢాది పాలనలో మోసాలు, వంచనలతోనే గడిచిందని, ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బుధవారం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
దీనికి నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద మహిళా గర్జన సభ నిర్వహిస్తామన్నారు. కష్టపడి, దశాబ్దాల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రస్తుతం దొరల పాలు, ద్రోహుల పాలైందన్నారు. ఉద్యమంలో పోరాడిన వాళ్లకు పదవులు రావట్లేదన్నారు.
తెలంగాణను అడ్డుకున్న వారికి ముఖ్యమంత్రి పిలిచి పదవులు ఇస్తున్నారని, 1300 మంది ఉన్న అమరవీరుల కుటుంబాలను గుర్తించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఆడవాళ్లు బతుకమ్మ ఆడేందుకే పరిమితం కావాలా అని నిలదీశారు. అమరుల తల్లులు మంత్రులు కావొద్దా అని ప్రశ్నించారు. కుటుంబం నుండి ఒక్కరు చాలరా అని నిలదీశారు. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులను కేబినెట్ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణపై పిడమర్తి రవి
మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగకు రేవంత్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని పిడమర్తి రవి అన్నారు. మందకృష్ణ మాట్లాడే ప్రతి మాట వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. నీ బిడ్డ చదవు కోసం బాబు వద్ద కోటి రూపాయలు తెచ్చుకున్నావని ఆరోపించారు.