నెల చాలు: రఘువీరా, పదేపదే రావొద్దు.. పిలుస్తాం: ముద్రగడ ఆగ్రహం, వ్యూహం మార్చిన ప్రభుత్వం!
రాజమహేంద్రవరం: కాపులకు రిజర్వేషన్లకు నెల రోజుల సమయం సరిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. ఇప్పటికే ఉన్న సర్వేలను పరిగణలోకి తీసుకుంటే నెల రోజుల్లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చన్నారు. కాపులకు రిజర్వేషన్ల పైన వెంటనే కేబినెట్, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు.
మాకు ఆరోగ్యం బాగా లేకుంటే మేమే పిలుస్తాం: ముద్రగడ
తమకు ఆరోగ్యం బాగానే ఉందని, తమ ఆరోగ్యం బాగా లేకుంటే తామే వైద్యులను పిలిపించుకుంటామని మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు చెప్పారు. వైద్యులు పదేపదే తమ వద్దకు రావొద్దని చెప్పారు. అంతకుముందు వైద్యులు పరీక్షలు నిర్వహించేందుకు మధ్యాహ్నం మరోసారి వారి వద్దకు వెళ్లారు.
ముద్రగడ, ఆయన సతీమణి కాపులకు రిజర్వేషన్లు కావాలని ఇంట్లో దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం వైద్యులు మాట్లాడుతూ.. ఇద్దరు కూడా నీరసంగా ఉన్నారని, పరీక్షలు చేస్తే ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చునని చెప్పారు. వారికి బీపీ, షుగర్ ఉన్నాయని, దీక్ష వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ముద్రగడ ఇంటి వద్ద సగం బలగాల ఉపసంహరణ
ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. పత్తిపాడు మండలం కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన అనుమతి లేకుండా తన ఇంటిలోకి పోలీసులు ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ తన గదిలోకి వెళ్లి స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.
దీంతో షాక్ తిన్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్కసారిగా వ్యూహం మార్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి నారాయణ సుదీర్ఘ వివరణతో కూడిన విన్నపాన్ని ముద్రగడ ముందుంచారు. అదే సమయంలో ముద్రగడ ఇంటి వద్ద భారీ ఎత్తున మోహరించిన బలగాల్లో సగం మంది పోలీసులను ప్రభుత్వం అక్కడి నుంచి ఉపసంహరించింది. బలగాలు కూడా కేవలం తనిఖీలకు మాత్రమే పరిమితమయ్యాయి.