‘నిట్’లో ర్యాగింగ్ కలకలం.. ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు!
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. బీహార్కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. ఫలితంగా కొంతమంది విద్యార్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై జూనియర్లు కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో కాలేజ్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను రెండు గ్రూపులుగా విభవించారు.
15 మంది విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోవైపు ర్యాగింగ్ కారణంగా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు.