రాహుల్ యాత్ర: కెసిర్పై పోరే, తెలంగాణ కాంగ్రెస్ నేతల జోష్ (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై రాజకీయ సమరం సాగిస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలకు తమ యువరాజు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పర్యటన జోష్ నింపినట్లే కనిపించింది. రాహుల్ గాంధీ శుక్రవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. దీనివల్ల తమ పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని కాంగ్రెసు తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కోసం కాంగ్రెసు నాయకులు చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి చివరకు రూపు దాల్చింది. హైదరాబాద్ రాకుండా ఆయన నేరుగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు వచ్చారు. పాదయాత్ర తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడి అక్కడి నుంచి నాందేడ్ వెళ్లిపోయారు. దాదాపుగా కాంగ్రెసు తెలంగాణ నేతలంతా రాహుల్ గాంధీ పర్యటనలో ఉన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీనే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ను మినీ మోడీగా అభివర్ణించారు. కెసిఆర్కు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా లేదని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కొరిటికల్ నుంచి...
శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొరిటికల్ నుంచి ప్రారంభించారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు.

కార్యకర్తల హల్చల్
రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు హల్చల్ చేశారు. కాంగ్రెసు నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పర్యటనలో దండిగానే కనిపించారు.

లక్ష్మణ్ చందాలో..
తిరుపెల్లి, లక్ష్మణ్ చందా, పొట్టపల్లి, రాచవూర్ మీదుగా ఆయన పాదయాత్ర సాగింది. లక్ష్మణ చందాలో ఆయన బోండ్ల లింగనన్న, అస్మన్న కటుంబాలను పరామర్శించారు.

వడ్యాల్లో బహిరంగ సభ
శుక్రవారం సాయంత్రం వడ్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించారు. మోడీపై, కెసిఆర్పై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

దిగ్విజయ్ సింగ్ కూడా..
రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కెసిఆర్పై విమర్శలు చేశారు. రైతుల గురించిన ఆలోచనే కెసిఆర్కు లోదని ఆయన అన్నారు.

వారు కూడా..
రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వెంట అసోం ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్, పార్లమెంటు సభ్యులు సుస్మిత, రాజ్ బబ్బర్ ఉన్నారు.

అనువాదకులుగా...
రైతులతో, కార్యకర్తలతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ మంత్రి గీతా రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి అనువాదకులుగా వ్యవహరించారు.

రాహుల్ కరచాలనాలు..
పాదయాత్ర చేస్తూ రాహుల్ గాంధీ కార్యకర్తలతో కరచాలనాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచే ప్రయత్నాలు చేశారు.

పార్టీ పరిస్థితిపై...
తన వెంట వచ్చిన నాయకులతో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలోని పరిస్థితిని వారు రాహుల్ గాంధీకి వివరించారు.

ఐదు కుటుంబాలకు పరామర్శ
తన పాదయాత్రలో రాహుల్ గాంధీ ఆత్మహత్యలు చేసుకున్న ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఆ కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

భూసేకరణ చట్టంపై...
రాహుల్ గాంధీ వడ్యాలలో జరిగిన బహిరంగ సభలో ఎన్డిఎ ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ చట్టంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టంలోని నిబంధనలు రైతులను ఎలా మోసం చేస్తాయో వివరించారు.

కెసిఆర్పై వ్యంగ్యాస్త్రాలు
అక్కడ మోడీ, ఇక్కడ మినీ మోడీ అంటూ వారికి రైతుల సమస్యలను పట్టించుకునే తీరిక కూడా లేదని, వారు రైతు సమస్యలను విస్మరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications