హోదా హామీ మాది కాదు.. భారత ప్రభుత్వానిది: మోడీకి రాహుల్ చురక
అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది.. యూపీఏ కాదని, భారత ప్రభుత్వం అని, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుంచుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు చెప్పారు. ఆయన అనంతపురం జిల్లా బండ్లపల్లి సభలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రులకు ప్రత్యేక హామీలు ఇచ్చామని రాహుల్ చెప్పారు. విభజన నేపథ్యంలో ఏపీలో ఎంతో అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుందని, కాబట్టి నాడు మేం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పామని రాహుల్ అన్నారు.
ఒక్క యూపీఏనే కాదని అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా పైన మాట ఇచ్చాయని చెప్పారు. 67 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రం ఇచ్చిన మాట తప్పడం ఇదే మొదటిసారి అని ప్రధాని మోడీ పైన విమర్శలు గుప్పించారు. కేంద్రం మాట తప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. భారత్ ప్రభుత్వ హోదాలో దానిని ప్రమాణం చేశామని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉందన్నారు.