హైద్రాబాద్ రాకుండా రాహుల్: అందుకే పదవి రాలేదని బీజేపీ, తెరాస ఏపీ ప్రస్తావన
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం రైతు భరోసా యాత్రను ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం నాందెడ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్కు మహారాష్ట్ర, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
నాందెడ్ నుండి ఆయన నిర్మల్ చేరుకుంటారు. అక్కడి నుండి శుక్రవారం ఉదయం ఏడు గంటలకు యాత్రను ప్రారంభిస్తారు. నిర్మల్లోని ఓ ప్రయివేటు హోటల్లో ఆయన గురువారం రాత్రి బస చేస్తారు. రోడ్డు మార్గం ద్వారా నిర్మల్ చేరుకుంటారు. రాహుల్ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పునర్వైభవం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
పర్యటనలో మార్పు
రాహుల్ గాంధీ మొదట.. హైదరాబాదు నుండి అదిలాబాదులోని నిర్మల్ వెళ్తారని చెప్పారు. అయితే, షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఆయన నాందెడ్ నుండి నేరుగా నిర్మల్ వెళ్తున్నారు. హైదరాబాదు రాకపోవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపించాయి.
దానిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... హైదరాబాదు రాకపోవడం వెనుక సదుద్దేశ్యమే ఉందన్నారు. హైదరాబాదు నుండి వచ్చినా అదిలాబాద్ రావాల్సిందేనని, అందుకే నేరుగా ఇక్కడకు వచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ రాకతో అధికార తెరాస, బీజేపీలకు వణుకుపుడుతోందని కాంగ్రెస్ నేతలు అన్నారు.

రాహుల్ గాంధీపై తెరాస, భాజపా భగ్గు
రాహుల్ గాంధీ రైతు పరామర్శ యాత్ర పైన బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలంగామ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తమది సూటుబూటు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీది సూటుకేసుల ప్రభుత్వమని నిప్పులు చెరిగారు.ట
యూపీఏ ఆత్మహత్యలు చేసుకున్న మూడు లక్షల మంది రైతు కుటుంబాలకు రాహుల్ సాయం చేయాలన్నారు. అదిలాబాదులో మాత్రమే సాయం చేస్తే సరిపోదన్నారు. ఆరు లక్షల గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేయాలన్నారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాపాల వల్లనే రాహుల్ గాంధీకి అధికారం దక్కలేదన్నారు. రాహుల్కు రైతుల సమస్యలు ఏమాత్రం తెలియదన్నారు.
రాహుల్ రైతు భరోసా యాత్ర పేరిట తెలంగాణలో చేపట్టనున్న పాదయాత్ర పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఆత్మహత్యల బాట పడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకే రాహుల్ తెలంగాణలో వస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలా రైతులను పరామర్శించే రాహుల్ గాంధీ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేస్తారని ఆ పార్టీ ప్రకటించారని, కానీ రాహుల్ పర్యటన ఉద్దేశ్యం రైతుల ఉద్దరణ కాదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలోనే రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారని చెప్పారు. అరవై ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. తాము కూడా రాహుల్ పర్యటనను పరిశీలిస్తామన్నారు. రైతుల ఆత్మహత్య నివారణకు రాహుల్ ఏం సలహాలిస్తారో చూడాలన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ తెలంగాణ రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నారని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తెలంగాణ భరోసా యాత్రపై బాల్క సుమన్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాహుల్ యాత్ర తెలంగాణకు మాత్రమే పరిమితం కావడానికి కారణమేంటన్నారు.
ఏపీలో రాహుల్ ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అవసరం లేకున్నా వేలాది ఎకరాలు రైతుల నుంచి చంద్రబాబు లాక్కుంటున్నా రాహుల్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ శైలిని చూస్తుంటే తెలుగుదేశం-కాంగ్రెస్లు కుమ్మక్కైనట్లు కనబడుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications