మినీ మోడీ చేసేందేమీ లేదు: కెసిఆర్పై రాహుల్ గాంధీ ధ్వజం
ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టంపై కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల భూములను బలవంతంగా లాక్కుని కొద్ది పాటి పరిశ్రమలకు ఇవ్వాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. పరిశ్రమలకు భూములు తీసుకుని ఉపాధి కల్పిస్తామని అంటున్నారని చెబుతూ ఎన్డీఎ ప్రభుత్వం గానీ తెలంగాణ ప్రభుత్వం గానీ ఇచ్చిందా అని ఆయన అడిగారు. మంచి రోజులు వస్తాయని చెప్పారు గానీ మోడీ ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చాయి గానీ ప్రజలకు కాదని ఆయన అన్నారు.
పది లక్షల రూపాయల విలువ చేసే సూట్ మోడీ ధరిస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ మోడీ, హైదరాబాద్లో మినీ మోడీ ఉన్నారని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నాయి గానీ వాటికి ఆ ఉద్దేశం లేదని ఆయన విమర్శించారు. 15 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం ప్రసంగించారు.

నేను ఒక్క రోజే నడిచా...
తాను ఒక్క రోజే ఎండలో నడిచానని, రైతులు జీవితమంతా ఎండలోనే పనిచేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి పౌరుడూ దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటాడని, అయితే రైతులు, కూలీలు తమ రక్తం, చెమట దేశం కోసం ధారపోస్తారని ఆయన అన్నారు. హరిత విప్లవం వల్లనే ఆహారం కొరత తీరిందని ఆయన చెప్పారు.

ఆపద వచ్చినప్పుడు..
ఆపద వచ్చినప్పుడు రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అవసరమని, మహారాష్ట్రలో, బుందేల్ఖండ్ల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి తమ యుపిఎ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని ఆయన చెప్పారు. రైతు నీళ్లు, కరెంట్, ఎరువులు లేకుండా పనిచేయలేదని, ఆ విషయాల్లో తమ గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిందని ఆయన గుర్తు చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు లభించేలా చర్యలు తీసుకుందని అన్నారు. అప్పుడు ప్రతి రైతూ ప్రయోజనం పొందాడని చెప్పారు.

రైతులకు హక్కు ఉండాలి..
నగరాలకు సమీపంలో ఉన్న భూముల ధరలు పెరుగుతున్నాయని, వాటిపై రైతులకు హక్కు ఉండాలని ఆయన అన్నారు. తాము తెచ్చిన బిల్లులో రైతులకు మేలు చేసే నిబంధనలు ఉన్నాయని, ప్రస్తుతం నరేంద్ర మోడీ తెస్తున్న భూసేకరణ బిల్లులో రైతులకు అన్యాయం చేసే నిబంధనలున్నాయని ఆయన చెప్పారు.

బలవంతంగా లాక్కుంటారు..
రైతులను అడక్కుండా బలవంతంగా భూములను లాక్కునే నిబంధనను పెట్టిందని, సోషల్ ఆడిట్ ఉండడం లేదని, ఏళ్ల తరబడి రైతుల నుంచి సేకరించిన భూములు నిరుపయోగంగా పడి ఉన్నా వాటిని తిరిగి తీసుకునే నిబంధనను తొలగించారని ఆయన అన్నారు.

ఉపయోగంలోకే రాలేదు...
ప్రత్యేక ఆర్థిక మండళ్లు 40 శాతం ఇప్పటి వరకు కూడా ఉపయోగంలోకి రాలేదని, వేల లక్షల ఎకరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిని వాడడం లేదని, పైగా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు వాటిని కట్టబెడుతామని ప్రభుత్వం అంటోందని ఆయన అన్నారు.

ఎనిమిది శాతమే..
భూమి లేకపోవడం వల్ల ఆగిపోయిన పరిశ్రమలు 8 శాతం మాత్రమే ఉన్నాయని, ఇతర పరిశ్రమలు రూపుదాల్చకపోవడానికి ఇతర కారణాలున్నాయని ఆయన అన్నారు. భూములను బలవంతంగా లాక్కోవద్దని తాము అంటున్నామని ఆయన చెప్పారు.

భూమి బంగారం...
భూమి బంగారమని, రానున్న రోజుల్లో భూముల ధరలు పెరుగుతాయని, అందుకే రైతుల భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఆ భూముల్లో పరిశ్రమలు రాకపోయినా తిరిగి రైతులకు వచ్చే మార్గం లేదని ఆయన అన్నారు.
రైతు కష్టాలు పడుతుంటే మోడీ గానీ, మినీ మోడీ గానీ మాట మాట్లాడడం లేదని ఆయన అన్నారు. రుణమాఫీపై మోడీ గానీ మినీ మోడీ గానీ ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను బిజెపి నాయకులు ఎందుకు పరామర్శించలేదని ఆయన అన్నారు. మోడీ గానీ, కెసిఆర్ రైతు కుటుంబాలను పరామర్శించి. వారిని ఆదుకుంటే తాను రావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. భయపడవద్దని, రైతుల తరఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అయితే రైతుల భూములను లాక్కోవద్దనేది తమ విధానమని ఆయన అన్నారు. ఒక్కరిద్దరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చే ఎన్డీఎ భూసేకరణ విధానానికి తాము వ్యతిరేకమని ఆయన అన్నారు.
తెలంగాణలో, భారతదేశంలో కొద్ది మంది కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. మోడీకి ఐదాగురు పారిశ్రామికవేత్తలు మిత్రులని, వారు విదేశీ పర్యటలకు మోడీతో పాటు వెళ్తారని, భారత ప్రయోజనాలను తాకట్టు పెడుతారని ఆయన అన్నారు. సూట్ బూట్ ప్రభుత్వంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించారు. రైతులకు, కూలీలకు, చిన్నపాటి వ్యాపారులకు మోడీ ప్రభుత్వం ఏమీ చేయదని ఆయన అన్నారు. మోడీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications