తిరుపతి, షిర్డీ, తిరువణ్ణామలైకు ప్రత్యేక రైళ్లు - స్టేషన్లు, షెడ్యూల్..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. దసరా, దీపావళి వేళ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్ల పైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లకు ఆదరణ కనిపిస్తోంది. దీంతో, ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, తిరుపతి - షిర్డీ.. నర్సాపురం - తిరువణ్ణామలై మధ్య రైళ్లను ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్ల కొనసాగింపు పైన రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు. దసరా, దీపావళి సందర్భంగా పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు అక్టోబరు 5 నుంచి నవంబరు 24 వరకు నడుస్తాయని వెల్లడించారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రత్యేక రైలు(07637), షిరిడీ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు(07638) నవంబరు 24 వరకు రాకపోకలు సాగిస్తాయి.

అదే విధంగా నరసాపురం- తిరువణ్ణామలై (07219-07220), హైదరాబాదు- కన్యాకుమారి (07230-07229), కాచిగూడ-మధురై (07191-07192), హైదరాబాదు- కొల్లాం ప్రత్యేక రైళ్లు (07193-07194) రేణిగుంట, తిరుపతి మీదుగా నవంబరు నెలాఖరు వరకు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇటు, దసరా వేళ తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లకు వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది.
దీంతో.. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. మరి కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ప్రకటన పైన కసరత్తు జరుగుతోంది. అదే విధంగా గుంటూరు - శ్రీకాళహస్తి మధ్య కొత్త మార్గం అందుబాటులోకి రావటంతో తిరుపతికి ఈ మార్గం మీదుగా ప్రత్యేక రైళ్ల నిర్వహణ దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. నర్సాపురం నుంచి తిరువణ్ణామలై రైళ్లకు ఉన్న డిమాండ్ తో వీటిని రెగ్యులర్ గా మార్చే ప్రయత్నం జరుగుతోంది.












Click it and Unblock the Notifications