ఏపీకి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ - స్టాపులు ఇవే...!!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. కేంద్రం రైల్వేలో మరో నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రత్యేక సదుపాయాలతో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధాని ప్రారంభిస్తున్న రెండు రైళ్లల్లో ఒకటి ఏపీలోని స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. ఈ స్టేషన్ల వివరాలను ప్రకటించారు.
రెండు రైళ్ల ప్రారంభం : ప్రధాన మంత్రి మోదీ డిసెంబర్ 30న రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. యూపీలోని అయోధ్య నుంచి బీహార్లోని దర్బంగా వరకూ ప్రయాణించ నుంది. రెండో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణాదిన నడుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్ప్రెస్ రైలు ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది. ఇందులో 12 స్లీపర్ తరగతి, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుంది. అయితే, ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది.

ఆకట్టుకొనే ఫీచర్లతో : ఈ రైలు పైన ప్రయాణీకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర ఎక్స్ప్రెస్ల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంటాయి. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. దానికి రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తిరిగి చెల్లించని (రీయంబర్స్ చేయని) రాయితీల ను ఈ రైళ్లల్లో అనుమతించరు. తొలిరైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి. ఏసీ తరగతుల ఛార్జీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల పాసులు మాత్రం అనుమతించాలని నిర్ణయించారు.

దశల వారీగా విస్తరణ : జీరో డిశ్చార్చ్ ఎఫ్ఆర్పీ మాడ్యులర్ టాయలెట్.. ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఉంది.ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ఇందులో ప్రత్యేకత. పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్వేలు.. రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్లు ఉన్నాయి. ప్రయాణీకులకు మంచి అనుభూతిని పంచేలా ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు చేశారు. బాటిల్ హోల్టర్, మొబైల్ చార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్లు ఉంటాయి. దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ రైళ్లను విస్తరించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications