సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : 7 గంటలు - నాలుగు స్టాపులు..!!
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కే ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 8న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధంచి రూట్ కూడా ఖరారు చేసారు. ఈ రైలు అందుబాటులోకి రావటం ద్వారా నిత్యం రద్దగా ఉండే తిరుపతికి వేగంగా చేరుకొనే అవకాశం ఏర్పడుతోంది. దాదాపు 7 నుంచి 7.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకొనే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ మార్గంలోనే వందేభారత్ నడపాలని నిర్ణయించారు. ప్రధాని ప్రారంభిస్తారని చెబుతున్నారు.
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ను ఏప్రిల్ 8న ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇంకా, అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. రైలు ప్రారంభానికి సంబంధించి దక్షణ మధ్య రైల్వే అటు గుంటూరు..ఇటు తిరుపతి డివిజన్ అధికారులను అప్రమత్తం చేసింది.
ప్రతీ రోజు ఉదయం సికింద్రాబాద్ లో బయల్దేరి మధ్నాహ్నం కు తిరుపతి చేరుకొనేలా తుది సమయాలను ఖరారు చేస్తున్నారు. అదే విధంగా మధ్నాహ్నం తిరుపతిలో బయల్దేరి రాత్రికి సికింద్రబాద్ చేరుకోనుంది. ఏడు గంటల నుంచి ఏడున్నార గంటల కాల పరిమితితో షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.

దీని ద్వారా ప్రస్తుతం ఈ మార్గంలో 12 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం నాలుగు గంటల వరకు తగ్గే అవకాశం ఉంది.సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకోనుంది.
ఈ మార్గంలో వందేభారత్ నాలుగు స్టేషన్లలో హాల్ట్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రం ఈ రైలు ఆగే విధంగా రూట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న రైళ్ల సమయాల్లో ఎటువంటి మార్పులు లేకుండా..వందేభారత్ ప్రయాణంతో ఆ రైళ్ల ప్రయాణానికి సమస్యలు రాకుండా కొత్త టైం టేబుల్ కు తుది రూపు ఇస్తున్నారు.

వందేభారత్ రైలులో సికింద్రాబాద్-తిరుపతికి కనీస ధర రూ.1150గా ఉండనుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాటే. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా రైలు నెంబర్.. స్టేషన్ల వివరాలు.. టికెట్ ధరలతో పాటుగా రైలు నడిచే టైం షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.
ఏప్రిల్ 8న ప్రారంభించడానికి నిర్ణయించినందున ట్రాక్, కోచ్ల నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేసారు. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు అందుబాటులోకి రావటం ద్వారా ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications