ఏపీలో మళ్లీ వర్షాలు: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు అలర్ట్
అమరావతి: తెలుగు రాష్ట్రాలను వానలు వీడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం ఉదయం నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్రతోపాటు రాజమహేంద్రవరం, ఏలూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పాడేరు, పార్వతీపురంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఏలూ రు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఇంకా వరద నీటి నుంచి బయటపడలేదు. జలదిగ్బంధంలోనే ఈ మండలాలు ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లోనే గత రెండు వారాలు తలదాచుకున్న ఈ గ్రామాల ప్రజలు.. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో బెంబేలెత్తిపోతున్నారు.
మరోవైపు, కోనసీమ జిల్లాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా పాములు సంచారం పెరిగిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరోసారి చెరువులు, వాగులు, నదులు పొంగిపొర్లే అవకాశం లేకపోలేదు.