ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు: ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం మాత్రం లేదు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు, తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయినా ఎండవేడిమి నుంచి ప్రజలకు పెద్దగా ఉపశమనం లేకుండా పోతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, యానాం మీదుగా తక్కుత ట్రోపోస్పిరిక్ దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ, మధ్య ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ వర్షాలతో ప్రజలకు ఎండవేడిమి నుంచి పెద్దగా ఉపశమనం మాత్రం ఉండదని స్పష్టం చేసింది. పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. వడగాలులు వీస్తాయని పేర్కొంది.
గత ఫిబ్రవరి నుంచి అనేక జిల్లాల్లో వేసవి వాతావరణం ప్రారంభమైంది. మార్చి 25న అనంతపురంలో అత్యధింకగా 39.9 డిగ్రీల సెల్సియస్, కడపలో 38.8, నంద్యాలలో38, కర్నూలులో 37.5, నందిగామలో 37.1, తిరుపతిలో 36.4, విశాఖపట్నంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications